వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కాపు సామాజికవర్గం నేతలు మండిపోతున్నారు. ఇంత కాలం వైసిపిని అంటిపెట్టుకుని ఉన్న పలువురు కాపు నేతలు కూడా తాజా పరిణామాల్లో జగన్ ను సమర్ధించలేని పరిస్దితుల్లో పడిపోయారు. దీనికంతటికీ కారణమేమిటంటే ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై జగన్ డ్యామేజింగ్ కామెంట్లు చేయటమే. పెద్దాపురంలో మీడియా జగన్ మాట్లాడుతూ, కార్లను మార్చినంత ఈజీగా పవన్ పెళ్ళాలను మారుస్తుంటాడు అని చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. ఆ వ్యాఖ్యలపైనే ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు నేతలు మండిపోతున్నారు.
పోయిన ఎన్నికల్లో పెద్ద దెబ్బే పడింది
ఉభయగోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలున్నాయి. పోయిన ఎన్నికల్లో వైసిపి గెలిచింది కేవలం 7 మాత్రమే. అంటే ఏ స్ధాయిలో వైసిపికి దెబ్బ పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ డ్యామేజిని రిపేరు చేసుకోవాల్సింది పోయి మరింత డ్యామేజి అయ్యేట్లుగా జగన్ మాట్లాడటమేంటని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. కాపు సామాజకవర్గంపై పవన్ ప్రభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందునా ఉభయగోదావరి జిల్లాలంటే ఇక చెప్పాల్సిన పనేలేదు. అటువంటి జిల్లాల్లో పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ విషయం జగన్ కు ఎవరూ కొత్తగా చెప్పాల్సి పనిలేదు. అన్నీ తెలిసి కూడా పవన్ కుటుంబం గురించి జగన్ ఎందుకు మాట్లాడారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
ఇపుడే జగన్ ఎందుకలా మాట్లాడారు ?
పవన్ పై జగన్ చేసిన కామెంట్ ఎంత వరకూ సబబన్న విషయాన్ని పక్కనబెడితే రాజకీయంగా మాత్రం వైసిపికి నష్టం చేయటం ఖాయమన్న వాదనలే ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా, పార్టీ పరంగా జగన్ ఇప్పటి వరకూ పపవన్ పై ఏ కామెంట్ చేసినా అదెక్కడా వివాదాస్పదం కాలేదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే పవన్ వివాహంపై చేసిన కామెంట్ మాత్రం వైరల్ అయ్యాయి. దానికితోడు జగన్ కుటుంబంపై పవన్ ఇప్పటికైతే హుందాగానే ఉన్నారనే చెప్పుకోవాలి. దాంతో జగన్ ఇమేజి మరింత డ్యామేజి అవుతోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం
జగన్ గురించి చెప్పుకునేటపుడు పోయిన ఎన్నికల గురించి చెప్పుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాలో కలిపి 34 నియోజకవర్గాలున్నాయి. పోయిన ఎన్నికల్లో 34 నియోజకవర్గాల్లో కలిపి వైసిపికి వచ్చింది కేవలం 7 నియోజకవర్గాలు మాత్రమే. మిగిలిన నియోజకవర్గాల్లో రెండింటిని బిజెపి గెలుచుకోగా మిగిలిన 25 నియోజకవర్గాలను టిడిపి స్వీప్ చేసింది. అందులో కూడా 15 నియోజకవర్గాలున్న పశ్చిమగోదావరి జిల్లాలో వైసిపికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. పోయిన ఎన్నికల్లో వైసిపి అంతలా దెబ్బ తినటంలో పవన్ పాత్ర చాలానే ఉందన్న విషయాన్ని మరచిపోకూడదు.
జగన్ పై మండుతున్న కాపు నేతలు
ప్రస్తుత విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని పవన్ చెబుతున్నారు. జనసేన బలమంతా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోనే కేంద్రీకృతమైందని ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో జనసేన అభ్యర్ధులను వైసిపి ఓడించాలంటే జగన్ చాలా జాగ్రత్తగా వ్యూహాలు రచించాల్సుంటుంది. అటువంటిది పవన్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడటమంటే చెత్తను నెత్తనేసుకోవటమే అంటూ కాపునాడు నేతలంటున్నారు. పవన్ ను విమర్శిస్తే కాపులెవరూ ఒప్పుకోరంటూ కాపు నేతలంటున్నారు. ఎందుకంటే, ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
జనసేనదే కీలక పాత్రా ?
ఇప్పటికైతే వచ్చే ఎన్నికల్లో జనసేన చూపించే ప్రభావంపై ఎవరికీ సరైన అంచనాలు లేవన్న మాట వాస్తవం. ఎన్ని స్ధానాల్లో జనసేన గెలుస్తుందన్న విషయమై భిన్న వాదనలు ఉన్నప్పటికీ టిడిపి, వైసిపి అభ్యర్ధులను ఓడించటంలో మాత్రం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు. అటువంటపుడు ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గం ఓట్లను ఆశిస్తున్న జగన్ పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఎవరు హర్షిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి పవన్ గురించి కానీ మరొకరి గురించి కానీ మాట్లాడేటప్పుడు జగన్ సంయమనం పాటిస్తే బాగుంటుంది.