ఒకవైపు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు సహకరించమంటూ చంద్రబాబునాయుడు కలెక్టర్లను, ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. అదే సమయంలో అదే పార్టీకి చెందిన ఎంఎల్ఏ మాత్రం ఐఏఎస్ అధికారితో పాటు ఎంఆర్వో ను బండబూతులు తిట్టారు. నిజానికి ఐఏఎస్ అధికారి, ఎంఆర్వో తప్పు లేకపోయినా అందరిముందు మాటలు పడాల్సొంచ్చింది. అదికూడా ఎక్కడో కాదు. సాక్ష్యాత్తు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ముందే కావటం గమనార్హం.
ఎంఎల్ఏకి సరైన సమాచారం ఇవ్వలేదట
ఇంతకీ ఏమి జరిగిందంటే, తిరుమల శ్రీవారి దర్శనార్ధం పై ఇద్దరు ప్రముఖులు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. వారిని రిసీవ్ చేసుకోవటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా గౌడ్, ఎంఆర్వో నరసింహులు నాయుడు కూడా ఎయిర్ పోర్టులో వెయిట్ చేస్తున్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లా ఉదయగిరి టిడిపి ఎంఎల్ఏ బొల్లినేని రామారావు కూడా ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. ఇంతలో విమానం దిగింది. ప్రముఖులను రిసీవ్ చేసుకునేందుకు ఎంఎల్ఏతో పాటు జాయింట్ కలెక్టర్ తదితరలుందరూ ఎయిర్ పోర్టులోని అరైవల్ ఎంట్రన్స్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు.
వివిఐపిలను రిసీవ్ చేసుకున్న ఎంఎల్ఏ
విమానం ల్యాండ్ అవ్వగానే జాయింట్ కలెక్టర్ విమానం దగ్గరకు వెళ్ళారు. వెంటనే ఒక బుల్లెట్ ప్రూఫ్ విమానం విమానం దగ్గరకే వెళ్ళటం, దేవేగౌడ, కుమారస్వామిలు ఎక్కి కూర్చోవటం అందరూ చూశారు. వారిద్దరూ ఎక్కగానే వాహనం మెయిన్ ఎంట్రన్స్ లో నుండి బయటకు వచ్చింది. దాంతో ఎంఎల్ఏ మెయిట్ ఎంట్రన్స్ దగ్గరకు పరిగెత్తుకుంటూ చేరుకున్నారు. మొత్తానికి వారిద్దరికీ స్వాగతం పలికారులేండి. అనేక అవినీతి కేసుల్లో ఇరుకుని ఏసిబి విచారణను ఎదుర్కొంటున్న ఈ ఎంఎల్ఏకి వివిఐపిలను రిసీవ్ చేసుకునే ప్రోటోకాల్ బాధ్యలు ఎవరు అప్పగించారో ఏమో ?
ఐఏఎస్ పై తిట్లదండకం
అయితే అదే సమయంలో జాయింట్ కలెక్టర్, ఎంఆర్వోలపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. వివిఐపిలు మెయిన్ ఎంట్రన్స్ లో నుండి బయటకు వస్తుంటే తనను ఎందుకు అరైవల్ ఎంట్రన్స్ వద్ద వెయిట్ చేయించావంటూ తిట్టటం మొదలుపెట్టారు. ఎంఎల్ఏ కోపాన్ని అర్ధం చేసుకున్న దేవేగౌడ జోక్యం చేసుకుని తానే వాహనాన్ని మెయిన్ ఎంట్రన్స్ వద్దకు తెప్పించమని ఆదేశించినట్లు చెప్పారు. ఎంల్ఏకు సర్ది చెప్పేందుకు కుమారస్వామి కూడా ప్రయత్నించారు. అయితే, ఎంఎల్ఏ శాంతించకపోయేటప్పటికీ అక్కడి నుండి వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు. అందరిముందూ తిట్లు తిన్న అధికారులు ఏం చేయగలరు ? ఎందుకంటే, తిట్టింది అధికార పార్టీ ఎంఎల్ఏ కదా ?