తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా ఓ మాట చెప్పారు. అదేమిటంటే యు టర్న్ తీసుకున్నది బిజెపినే అని. తాను మాత్రం రైట్ టర్నే తీసుకున్నారట. మొదటి నుండి తనది రైట్ టర్నేఅట. ప్రజల జ్ఞాపకశక్తి మీద చంద్రబాబుకు మంచి నమ్మకం ఉన్నట్లుంది. పొత్తులు పెట్టుకున్నపుడు పోయిన ఎన్నికల్లో బిజెపి, టిడిపిలు జనాలకు ఇచ్చిన హామీలేమిటి ? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాయి ? అనే విషయాలు జనాలకు బాగానే గుర్తుంది.
ఇచ్చిన హామీలు గుర్తున్నాయా ?
ఎన్నికలకు ముందు తానిచ్చిన హామీలేంటి ? అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమిటి అనే విషయాలపై చంద్రబాబుకు జ్ఞాపకముందా ? అన్నదే అందరిలోనూ మొదలైన సందేహం. చంద్రబాబు తాజా మాటలు విన్న తర్వాత సందేహాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే, అటు బిజెపి ఇటు చంద్రబాబు ఇద్దరూ యు టర్న్ తీసుకోవటం వాస్తవం.
ఒత్తిడి వల్లే చంద్రబాబు యు టర్న్ తీసుకున్నారా ?
ఎందుకంటే, విభజన చట్టాన్ని అమలు చేయకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడి యుటర్న్ తీసుకున్నారనటంలో సందేహం లేదు. అదే సమయంలో కేంద్రం ఆడించనట్టల్లా ఆడటమే కాకుండా విడిగా తానిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయకుండా చంద్రబాబు కూడా యుటర్న్ తీసుకున్నారు. కలిసి కాపురం చేసిన మొదటి నాలుగేళ్ళు రాష్ట్రప్రయోజనాలను చంద్రబాబు గాలికొదిలిపెట్టారు. కేంద్రం ఏ పాట పాడినా దానికి తగ్గట్లే తాళం వేశారు. అదే సమయంలో కేంద్రంతో కలిసి చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ వైసిపి అధ్యక్షుడు చేసిన ఆరోపణలను ఏమాత్రం ఖాతరు చేయలేదు.
జగన్ ఒత్తిడి వల్లే
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హటాత్తుగా బిజెపితో కటీఫ్ చెప్పారు చంద్రబాబు. అప్పటి నుండే ఏపికి కేంద్రం చేసిన అన్యాయం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రత్యేకహొదా, ప్రత్యేక రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఇలా..ప్రతీ అంశం మీద కేంద్రం మోసాన్ని చంద్రబాబు చెబుతున్నారు. మరి, ఇదే అంశాలను కూడా జగన్ మొదటి నుండి మొత్తుకుంటోంది ? చంద్రబాబు ఎంత బుకాయించినా ఇప్పటికిప్పుడు చంద్రబాబు యుటర్న్ తీసుకున్నారంటే అందుకు కారణం జగనే అని చెప్పుకోవాలి.