రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లైంది. ఆ షాక్ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అన్నీ పార్టీలకు ఒకేసారి షాక్ తగిలింది. ఇంతకీ ఒక్కసారిగా అన్నీ పార్టీలకు ఒకేసారి షాక్ ఎలా కొట్టిందని ఆలోచిస్తున్నారా ? ఆ షాక్ ఇచ్చింది ఇంకెవరో కాదు, స్వయానా ఎన్నికల సంఘం. అది కూడా ప్రతీ నియెజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లను తొలగించటం ద్వారా. అందుబాటులో ఉన్న అంచనా ప్రకారం మొత్తం 175 నియోజకవర్గాల్లో లెక్కిస్తే లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయని సమాచారం.
అన్నీ చోట్లా తగ్గిపోయిన ఓట్లు
పోయిన ఎన్నికలతో పోల్చుకుంటే వచ్చే ఎన్నికలకు ఓట్లు పెరగాలి. కానీ విచిత్రంగా తగ్గిపోయాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇంకెన్ని లక్షల ఓట్లు మాయమైపోతాయో అని పార్టీల్లో ఆందోళన మొదలైంది. ఉదాహరణకు తీసుకుంటే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2014లో 2.65 లక్షల ఓట్లున్నాయట. తాజా ఓట్లు ఎంతంటే 1.7 లక్షలట.
లక్షల్లో ఓట్లు గల్లంతు
అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 70 వేల ఓట్లు, పెనమలూరులో 40 వేల ఓట్లు, విశాఖపట్నం దక్షిణంలో 55 వేల ఓట్లు, గుంటూరు 1లో 40 వేలు, కడపలో సుమారు 1.2 లక్షల ఓట్లు ఇలా.. ఏ నియోజకవర్గంలో చూసినా సగటున వేలల్లో ఓట్లు మాయమైపోయాయి. అధికార టిడిపినే తమ ఓట్లను గల్లంతు చేసేస్తున్నట్లు ఎప్పటి నుండో వైసిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇపుడు టిడిపి ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గాల్లో కూడా వేలాది ఓట్లు ఎలా గల్లంతయ్యాయ్ ?
ఎవరికి నష్టమో ఏమో ?
ఓట్ల గల్లంతుకు ఎన్నికల సంఘం అధికారుల నిర్వాకమే కారణంగా తెలుస్తోంది. ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేశారట. దాంతో ఆధార్ కార్డులో పేరు, ఓటరు కార్డులో పేరులో స్పెల్లింగ్ లో తేడా ఉండటంతో ఓట్లను తీసేశారట. అలాగే, ఎన్నికల సంఘం సర్వర్ కూడా మొరాయించటంతో వివరాలు దొరకటం లేదట. ఆధార్ కార్డుకు ఓటరు కార్డుకు లింక్ పెట్టవద్దని సుప్రింకోర్టు చెప్పినా ఎన్నికల సంఘం వినటం లేదు. దాంతో జాబితా నుండి లక్షల్లో ఓటర్ల వివరాలు మాయమైపోయాయి. లక్షల్లో ఓటర్ల పేర్లు గల్లంతవ్వటం వల్ల ఎవరికి నష్టం కలిగిస్తుందో ఏమో ?