తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ఆదివారం వైసిపి కీలక సమావేశం జరుగుతోంది. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జగ్గంపేటలోనే సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అన్ని నియోజకవర్గాలను వదిలిపెట్టి జగ్గంపేటలోనే కీలక సమావేశం ఏర్పాటు చేయటంపై పార్టీ నేతలు ఆసక్తికరమైన విషయం చెప్పారు.
చివరి నిముషంలో చేరిన జగ్గంపేట ?
జిల్లా పాదయాత్ర రూట్ మ్యాప్ లో జగ్గంపేట నియోజకవర్గం అసలు లేనే లేదట. పాదయాత్ర పూర్తయిన తర్వాత జగన్ కొంత కాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ బస్సుయాత్ర చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఆ బస్సుయాత్రలో జగ్గంపేట నియోజకవర్గం కూడా ఉంది. అందుకే పెద్దాపురం తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించాలట. కానీ చివరినిముషంలో జగనే స్వయంగా పార్టీ నేతలకు చెప్పి జగ్గంపేట నియోజకవర్గాన్ని పాదయాత్రలో చేర్చారట. ఇక, జగన్ స్వయంగా చెప్పిన తర్వాత చేసేదేముంది ? అందుకే రూట్ మ్యాప్ లో అప్పటికప్పుడు జగ్గంపేటను చేర్చటం, పెద్దాపురం నుండి జగ్గంపేటలోకి జగన్ ప్రవేశించటం అన్నీ చక చకా జరిగిపోయాయి.
హటాత్తుగా రూట్ మ్యాప్ ఎందుకు మారింది ?
అంత హటాత్తుగా జగన్ రూట్ మ్యాప్ మార్చటానికి కారణం ఏంటి ? ఏంటంటే, పోయిన ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో వైసిపి నుండి జ్యోతుల నెహ్రూ గెలిచారు. నెహ్రూకు జగన్ చాలా ప్రాధాన్యత ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది గెలిచిన కొంత కాలానికి నెహ్రూ టిడిపిలోకి ఫిరాయించారు. దాంతో అప్పటి నుండి నెహ్రూ అంటే జగన్ కు బాగా మండుతోంది. ఆ కోపంతోనే నెహ్రూ స్ధానంలో టిడిపిలో కీలకమైన నేత అయిన జ్యోతుల చంటిబాబుని పార్టీలో చేర్చుకుని సమన్వయ కర్తగా నియమించారు. బహుశా వచ్చే ఎన్నికల్లో టిడిపి నుండి నెహ్రూ, వైసిపి నుండి చంటిబాబు పోటీలో ఉండేది దాదాపు ఖాయమే.
పట్టు పట్టిన చంటిబాబు
ఈ నేపధ్యంలో జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తూ జగ్గంపేటలోకి అడుగు పెట్టకుండా వెళ్ళిపోవటం చంటిబాబుకు ఏమాత్రం నచ్చలేదట. అందుకే పదే పదే తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయాల్సిందేనంటూ చంటిబాబు పట్టుబట్టారట. అప్పటికే జగన్ కు కూడా నెహ్రూపై మండుతుండటం, చంటిబాబు పట్టుబట్టడంతో చివరకు జగ్గంపేటలో పాదయాత్ర చేయటానికే జగన్ నిర్ణయించుకున్నారట. అందుకనే చివరి నిముషంలో రూట్ మ్యాప్ లో మార్పులు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఫిరాయింపుకు హెచ్చరికేనా ?
జగ్గంపేటలో పాదయాత్ర చేయటానికి జగన్ ఎప్పుడైతే అంగీకరించారో వెంటనే చంటిబాబు శనివారం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో ఆదివారం రాష్ట్రస్ధాయి కీలక సమావేశం కూడా పెట్టుకున్నారు. దాంతో ఏర్పాట్లు చేయటమన్నది ప్రిస్టేజ్ గా మారింది. చంటబ్బాయ్ కూడా నియోజకవర్గంలో తన సత్తా ఏంటో చూపటానికి రెడీ అయ్యారు. అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూకు జగ్గంపేటలో జగన్ పాదయాత్ర హెచ్చరికలాంటిదే అని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.