జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. ప్రశ్నించటం కోసమే పార్టీని పెట్టానంటూ ఇంత కాలం చెప్పుకొచ్చిన పవన్ ఇపుడు పాలించటమే మిగిలిందంటున్నారు. పైగా ప్రశ్నించేదశ దాటిపోయి పాలించేదశకు చేరుకున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. పార్టీ పెట్టి ఇంతకాలం ఎవరిని, ఏమని ప్రశ్నించారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
మద్దతుగా ప్రచారం
పోయిన ఎన్నికల్లో బిజెపి, చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడ్డారు. వివిధ జిల్లాల్లో పై పార్టీల అభ్యర్ధులకు ప్రచారం చేశారు. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించటమే తన పనిగా చెప్పుకున్నారు. ఇపుడిచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే ఎవరినీ వదిలేది లేదని ఒకటికి పదిసార్లు గంభీరంగా ప్రకటించారు. అధికారంలో ఉన్నది ఎంతటి వారైనా సరే చొక్కాపట్టుకుని నిలదీస్తానంటూ భీకర శపథాలే చేశారు. పవన్ చెబుతున్నవన్నీ నిజాలే అనుకుని జనాలు బిజెపి, టిడిపి అభ్యర్ధులకు ఓట్లేశారు.
ప్రయోజనాలను తాకట్టుపెట్టేశారు
ఎన్నికలై రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ? రెండు పార్టీలు కలిసి పవన్ ను దూరంపెట్టి వాటి సొంత అజెండాతో ముందుకెళ్ళాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి చంద్రబాబునాయుడును అడిగితే సమాదానమే లేదు. పైగా అడ్డదిడ్డమైన పాలనతో రాష్ట్రాన్ని అధోగతిపాల్జేశారు. రాజధాని పేరుతో వేలాది ఎకరాల పంట పొలాలను బలవంతంగా తీసేసుకుంటున్నారు. అవినీతి పెరిగపోయింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రప్రభుత్వం ముందు తాకట్టుపెట్టారు.
చంద్రబాబును కాపాడిందే పవన్
రాష్ట్రంలో నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు అన్నీ వ్యవస్దలనూ భ్రష్టుపట్టించారు. ఆ విషయాలపై సామాన్య జనాలు మొత్తుకుంటున్నారు. సోషల్ మీడియా కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. అయినా పవన్ లో చలనం కనబడలేదు. వివిధ వర్గాలు పవన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై చెప్పుకున్నపుడు కూడా పవన్ స్పందించలేదు, చంద్రబాబును ప్రశ్నించలేదు. పైగా చంద్రబాబు పాలనపై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆందోళనలకు పిలుపిచ్చినపుడల్లా పవన్ పోటీ కార్యక్రమాలు పెట్టారు. అంటే చంద్రబాబుకు ఇబ్బందులు వచ్చినపుడల్లా పవన్ రంగంలోకి దిగి కాపాడేవారు.
ఎప్పుడూ నిలదీసింది లేదు
ఎప్పుడైతే చంద్రబాబుతో పవన్ కు వ్యక్తిగతంగా చెడిందో అప్పుడే చంద్రబాబు పాలనలో పవన్ కు లోపాలు కనిపించాయి. గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభ నుండి చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసుకుని పవన్ ఆరోపణలు చేయటం, నిలదీయటం మొదలుపెట్టారు. అంటే పవన్ ఇపుడు చెబుతున్నట్లుగా ఎప్పుడూ ఎవరినీ ప్రశ్నించింది లేదు చొక్కా పట్టుకున్నదీ లేదు. మరి ప్రశ్నించటమైపోయింది..ఇక పాలించటమే మిగిలిందని పవన్ చెప్పటంలో ఏమైనా అర్ధముందా ?