జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధేంటో అర్ధం కావటం లేదు. అసెంబ్లీలో ఎంఎల్ఏల బలం జగన్ కు ఉన్నందుకా ? లేక తనకు లేనందుకా ? పదే పదే వైసిపి ఎంఎల్ఏలు అసెంబ్లీని బహిష్కరిస్తున్నారని, తనకు గనుక ఎంఎల్ఏల బలముంటే ఊపేసేవాడిని అంటూ తరచూ పవన్ మాట్లాడుతున్నారు. లేని దాని గురించే పవన్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. వైసిపి ఎంఎల్ఏలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది వాళ్ళ సమస్య. వాళ్ళు చేసింది కరెక్టా కాదా అన్నది తేల్చాల్సింది జనాలు. మధ్యలో పవన్ బాధేంటి ?
సమస్యలపై పోరాడాలని తెలీదా ?
ఆమధ్య పవన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారమే ఉండాలా అంటూ అమాయకంగా ప్రశ్నించారు. పరోక్షంగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఎత్తి పొడిచారు. ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారమే ఉండాలా ? అంటూ ప్రశ్నించిన పవన్ కు సమస్యలపై పోరాటం చేయాలని తెలియకపోవటమే విచిత్రంగా ఉంది. పైగా తాను పార్టీ పెట్టిందే ప్రశ్నించటానికని పవన్ ఎన్నో సార్లు చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నాలుగేళ్ళల్లో పవన్ ఎన్నిమార్లు ప్రశ్నించారో చెబితే బాగుంటుంది.
కనిపించని రాష్ట్ర సమస్యలు
అసెంబ్లీలో ఎంఎల్ఏలుంటే ఊపేసేవాడినంటూ పవన్ చెబుతున్నవి ఉత్త కబుర్లు మాత్రమే. సమస్యలపై పోరాటాలు చేయటానికి అధికారంతో సంబంధం లేదని చెప్పే పవన్ మరెందుకు పోరాటాలు చేయలేదు ? చంద్రబాబు నాలుగేళ్ళ పాలనంతా రామరాజ్యమేనా ? ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తున్నారా ? ఎంతో మంది జనాలు స్వయంగా పవన్నే కలుసుకుని ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయాలను మొత్తుకున్నారు కదా ? మరెందుకు స్పందించలేదు .
పోరాడకుండా ఎవరైనా అడ్డుపడ్డారా ?
అధికారంలోకి రావటమే లక్ష్యంగా పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు 600 హామీలిచ్చారు. ఆ హామీల్లో సంపూర్ణంగా అమలైన హామీలెన్ని ? ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు ? చంద్రబాబుతో కలిసి ప్రచారం చేస్తున్నపుడు హామీల అమలు బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ చెప్పిన మాటలు మరచిపోయారా ? రాజధాని నిర్మాణం కోసం తమ నుండి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని రైతులు పవన్నే కలిసి నెత్తీ నోరు మొత్తుకుని చెప్పుకున్నా పవన్ పట్టించుకోలేదు. రైతుల తరపున నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన పవన్ మళ్ళీ ఆ విషయంపై ఎందుకు ఇప్పటి వరకూ మాట్లాడలేదు ?
చెప్పేవన్నీ ఉత్త కబుర్లే
క్షీణించిన శాంతి భద్రతలు, పెరిగిపోయిన అవినీతి, ప్రభుత్వ యంత్రాంగంపై టిడిపి నేతల దాడులు, రాజధాని నిర్మించలేకపోవటం లాంటి సమస్యలు అనేకమున్నాయి. పోరాటాలపై పవన్ కు చిత్తశుద్ది ఉంటే సమస్యలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. అసెంబ్లీలో ఎంఎల్ఏలుండుంటే అని, జగన్ పారిపోయాడనే ఆరోపణలు, మాటలు మానేసి సమస్యల పరిష్కారానికి తానేం చేయగలరో పవన్ కల్యాణ్ చెబితే బాగుంటుంది.