తమిళనాడులో మరోసారి ఉత్కంఠత మొదలైంది. కురువృద్దు..అపర చాణక్యులు అని చెప్పే డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై మరోసారి వదంతులు రేగాయి. సాధారణ జ్వరం కారణంగా కరుణ స్వల్ప అస్వస్థతకు గురికాగా, కరుణ ఆరోగ్యం విషమించిందని వార్తలు రావడంతో డీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందారు. మరోవైపు కరుణ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఆయన కులాసాగానే ఉన్నారని కరుణ తనయుడు, డీఎంకే కార్యచరణ అధ్యక్షుడు స్టాలిన్ స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా వయసురీత్యా సమస్యలతో కరుణానిధి(94) బాధపడుతున్నారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఆపై ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో గోపాలపురంలోని ఆయన ఇంటిలోనే శుక్రవారం వైద్యులు చికిత్స అందించారు. వార్త తెలియగానే పలువురు ప్రముఖులు కూడా ఆయన్ని పరామర్శించారు.
ఇదిలా ఉంటే ‘కలైగ్నర్’ ఆరోగ్యంపై వదంతులు రావటంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు దూసుకొచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కార్యకర్తలతో రోడ్డు నిండిపోవటంతో భారీ ఎత్తున్న పోలీసులు మోహరించారు. ప్రస్తుతం కావేరీ ఆస్పత్రి వద్దకు భారీ ఎత్తున్న కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఆయనను పరామర్శించేందుకు పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు గోపాలపురం రావద్దని, వైద్యుల సలహా మేరకు ఆయన మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారని స్టాలిన్ తెలిపారు.