కృష్ణా జిల్లా గుడివాడలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్టుగా తయారైంది. ఇక్కడ మునిసిపల్ కౌన్సిల్లో చెలరేగిన రాజకీయ ముసలం రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది. గుడివాడ పురపాలక సంఘం వైస్ చైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ కౌన్పిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల్లో పురపాలక సంఘంలో మొత్తం 36 మంది కౌన్సిల్ సభ్యులలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 16 మంది సభ్యులు గెలుపొందారు. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. రెండేళ్ల కిందట చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావుతో పాటు 11 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి ఫిరాయింపు అయ్యారు. దీంతో టీడీపీ బలం 28కి పెరిగింది.
కౌన్సిలర్లు 28 సభ్యులతో సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీలను కలెక్టర్ లక్ష్మికాంతంకు పంపించారు. కలెక్టర్ దీనిపై ప్రత్యేక సమావేశం కోసం సభ్యలకు నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ చక్రపాణిని ఆదేశించారు. అయితే, దీనికి ముందు తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం రేగింది. దీనికి అదుపు చేసేందుకు టీడీపీ సీనియర్లు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏం జరిగితే అదే జరుగుతుందని పార్టీ అధిష్టానం కూడా గుడివాడ టీడీపీ నేతలను వదిలేసింది. దీంతో వీరు అవిశ్వాసానికే మొగ్గు చూపారు. గుడివాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ(బాబ్జి)పై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని వాయిదా వేసినట్లు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్డీవో గుత్తుల సత్యవాణి పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో శనివారం జరగాల్సిన అవిశ్వాసాన్ని వాయిదా వేశారు. కాగా... ఇప్పటికే మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస ప్రక్రియ పెండింగ్లో ఉంది. ఈ పరిణామం గడిచిన రెండు నెలలుగా ఇక్కడ హాట్ టాపిక్గామారినా కూడా పార్టీ అధిష్టానం ఒకరిద్దరు కీలక నాయకులను షార్ప్ షూటర్లుగా రంగంలొకి దింపింది. అయితే, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో ఇక్కడ చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకే నాయకులు రెడీ అయ్యారు. అయితే, ప్రస్తుతం నాయకులు ఎస్కేప్లో ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి టీడీపీ వ్యవస్తాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాలో పరిస్థితి ఇలా ఉండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుండడం గమనార్హం.