పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఎక్కువగా తన గురించి తానూ చెప్పుకోవడానికే టైం సరిపోతుంది. తాను అధికారం లోకి వస్తే ఏం చేస్తానో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. అది వదిలేసి తన బాల్యం గురించి నేను ఇక్కడే పెరిగాను. నాకు చేగువేరా అంటే ఇష్టం ఇవన్నీ ఒక సారి చెబితే సరే అనుకోవచ్చు. ప్రతి సభలో ఇదే సెల్ఫ్ డబ్బా అవ్వటం వల్లే ప్రజలు కొంచెం చిరాకు పడుతున్నారు. నీ రాజకీయ అజెండా ఏంటో ప్రజలకు చెప్పు అంతే కానీ నీ పుట్టు పూర్వత్త్రాలు వారికి అవసరం లేదు.
వ్యక్తుల ప్రయివేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. జగన్ను పక్కన పెడితే సామాన్యులు అదే ప్రశ్న వేస్తే ఏమని జవాబు చెబుతారు. ఉదాహరణకు అవినీతి అంశమే తీసుకొందాం. జగన్ లేదా లోకేష్.. మరెవరైనా కావచ్చు, అది మా వ్యక్తిగతం అంటే ఒప్పుకుంటారా? రాయలసీమలో ఫ్యాక్షనిజానికి నీళ్లు లేకపోవడమే కారణం. దానిగురించి మీరెప్పుడైనా స్పందించారా? అంతేకాదు విప్లవం గురించి మాట్లాడినంత మాత్రాన విప్లవకారులు కాలేరు.
చేగువేరాను అభిమానించనంత మాత్రాన ఆయనలా ఆదర్శప్రాయులు కాలేరనే సత్యాన్ని గ్రహించండి. మీరు నాయకుల కేంద్రంగా కాకుండా సమాజం, ప్రజల ఎజెండాగా రాజకీయాలు చేస్తే మంచిది. ఎవరికీ లేని సైన్యం నాకుంది, నేను అనుకుంటే ఎవరి వ్యక్తిగత గుట్టునైనా విప్పుతాననే ప్రగల్భాలు పలకొద్దు. రాహుల్కు పెళ్లికాలేదు కాని బ్రహ్మచారి మాత్రం కాదు అని మీరిప్పటికి రెండుసభల్లో చెప్పారు. ఇది వ్యక్తిగత విమర్శ అవునా? కాదా?. మీకో నీతి, ఇతరులకైతో మరో నీతా?