తనకు మెచ్యూరిటీ లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడి లోక్ సభలో చెప్పడంతో చంద్రబాబు గింజుకుపోతున్నారు. మోడి లోక్ సభలో చెప్పింది ఒక్కసారే. తనకు మెచ్యూరిటీ లేదని మోడి చెబుతారా అంటూ చంద్రబాబే ఒకటికి పదిసార్లు రాష్ట్రంలోను, ఢిల్లీలోనూ చెప్పుకుంటున్నారు. మెచ్యూరిటీ విషయాన్ని పదే పదే చెప్పుకోవటంలోనే చంద్రబాబు మెచ్యూరిటీ ఏంటో తెలిసిపోతోంది. పైగా ఎవరికి మెచ్యూరిటీ లేదో తేల్చుకుందామంటూ ప్రధానికి సవాలు విసురుతున్నారు. మెచ్యూరిటీ అంటే వ్యక్తిత్వం, హుందాతనమనే విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబు పాలనను చూసినా, ప్రోత్సహించిన ఫిరాయింపులు తదితరాలను చూసిన వారికి చంద్రబాబు ఎంత మెచ్యూరుడుగా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది.
మోడి అన్నదాంట్లో నిజమెంత ?
చంద్రబాబుకు మెచ్యూరిటీ లేదని మోడి అనటం కాదు కానీ అసలు నిజమెంతో చూద్దాం. పోయిన ఎన్నికల్లో తానిచ్చిన హామీలను చంద్రబాబు ఎంత బాగా అమలు చేసింది అందరూ చూస్తున్నదే. ఒక్క హామీని కూడా చంద్రబాబు సంపూర్ణంగా అమలు చేయలేదు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలు వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది వేరు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలను అమలవుతున్న విధానాలను ఎవరైనా గుర్తు చేస్తే వారిపై చంద్రబాబు మండిపోతున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే. ఇచ్చిన హమీలను అమలవుతున్న విధానాన్ని గుర్తు చేస్తే మెచ్యూరిటీ ఉన్న చంద్రబాబు ఎందుకు మండిపోతున్నారు ?
హోదాపై పిల్లి మొగ్గలు
ఇక, ప్రత్యేకహోదాపై నాలుగేళ్ళల్లో చంద్రబాబు ఎన్నిసార్లు పిల్లిమొగ్గలు వేసింది అందరూ చూస్తున్నదే. బిజెపితో అంటకాగినంత కాలం ప్రత్యేకహోదాపై నోరెత్తని, నెరిత్తితే అరెస్టులు చేయిస్తానంటూ బెదిరించిన ఇదే చంద్రబాబు ఇపుడు హటాత్తుగా హోదాపై మొదటి నుండి పోరాటం చేస్తున్నది తానే అని చెప్పుకోవటాన్ని ఏమంటారు ? మెచ్యూరుడుగా ఉన్న వారెవరైనా చేసే పనేనా ఇది ? ప్రత్యేకహోదాపై ప్రతిపక్షం చేసిన, చేస్తున్న పోరాటాలను కూడా స్వాగతించలేని స్ధితిలో ఉన్న చంద్రబాబు తాను మెచ్యూరుడంటే ఎవరైనా నమ్ముతారా ?
ఏపికి జీవన్మరణ సమస్యే
ఏపికి ప్రత్యేకహోదా సాధన అన్నది రాష్ట్ర జీవన్మవరణ సమస్యగా చంద్రబాబు చెప్పారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గడచిన నాలుగేళ్ళుగా చెబుతున్నదే చంద్రబాబు ఇపుడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు తీసుకున్న యుటర్న్ ఆధారంగానే లోక్ సభలో చంద్రబాబు గురించి మోడి చులకనగా మాట్లాడారు. న్యాయం కోసం వేరే దారిలేక ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు చంద్రబాబు వివరించారు. మరి ఇదే పని ఇంకా ముందే చేసుండాల్సింది. మోడికి భయపడి వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసి ఇళ్ళల్లో దాక్కున్నట్లు ఎద్దేవా చేయటం ఆశ్చర్యంగా ఉంది. ధైర్యముంటే ఎంపి పదవులకు రాజీనామాలు చేయాలని సవాలు చేసిందే చంద్రబాబు, టిడిపి నేతలు. రాజీనామాలు చేసిన తర్వాత వాటిని దమ్ముంటే ఆమోదింపచేసుకోమ్మంటూ కవ్వించిదీ చంద్రబాబు అండ్ కోనే. తీరా రాజీనామాలు ఆమోదం పొంది వైసిపి ఎంపిలు మాజీలైన తర్వాత రాజీనామాలతో నాటకాలుడుతున్నారంటూ ఎగతాళి చేస్తున్నదీ చంద్రబాబే. మరి, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదే.
తెలుగు పౌరుషం చూపిస్తారట
తెలుగువాళ్ళ పౌరుషం ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లు తెలుగువాళ్ళకి అంత పౌరుషమే ఉంటే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినపుడే వాళ్ళ పౌరుషమేంటో చూపేవారు. హోదా కోసం పిల్లిమొగ్గలు వేసినపుడే పౌరుషం చూపేవారు. మహిళల మాన ప్రాణాలను పణంగా పెట్టిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం వెలుగు చూసినపుడు కూడా ఎవ్వరూ పౌరుషాన్ని చూపలేదు. ఇక, హోదా కోసం లోక్ సభలో ఎవ్వరూ టిడిపికి మద్దతు ఇవ్వలేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు మాత్రం జాతీయ పార్టీలన్నీ టిడిపికి మద్దతుగా నిలిచినట్లు చెప్పుకుంటున్నారు.