ఆయన రాజకీయ దురంధరుడు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆయన తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. అన్నిటికీ మించి వివాద రహితునిగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఆయనే నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉన్న ఆయన వైఎస్ తనయుడు జగన్ స్తాపించిన వైసీపీలోకి చేరిపోయారు. నెల్లూరునుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్లో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. అధిష్టానం మాటకు కట్టుబడడం ఆయనలోని పెద్ద ప్లస్ పాయింట్. దానికి కట్టుబడే ఆయన విపక్షంలో ఉన్నప్పటికీ.. జగన్ మాటను తీసేయలేక ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరులో ఎంపీ పదవిని త్యాగం చేయాలన్న అధినేత సూచనలకు అనుగుణంగా ఆయన ముందుకు నడిచారు.
అయితే, గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలవడంతో జనంలో తగ్గిన క్రేజ్, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బలాబలాల్లో వచ్చిన మార్పులు చూస్తే.. ఎదురీత తప్పదనే భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో రాజకీయంగా కనిపించిన అనుకూలతలు ఈసారి కనిపించకపోవడం, ఎంపీగా గత నాలుగేళ్ల కాలంలో సాధించిన విజయాలు గట్టిగా చెప్పుకొనేందుకు ఏమీ లేకపోవడం రాబోయే ఎన్నికల్లో రాజమోహన్రెడ్డికి ప్రతిబంధ కాలుగా మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు ఎంపీ ఎన్నికల చరిత్రలో అత్యంత భారీ మెజారిటీ, అత్యంత స్వల్ప మెజారిటీ సాధించిన ఎంపీగా మేకపాటి చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల మెజారిటీని గమనిస్తే 2014 నాటికే ప్రజల్లో ఆయన పరపతి కొంత తగ్గిందనిపిస్తుంది.
ఇదే నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలకు మొత్తం 73,500 ఓట్ట మెజారిటీ వచ్చింది. వాస్తవానికి కొంచెం అటు ఇటుగా ఎంపీ అభ్యర్థికీ ఇదే మెజారిటీ రావాలి. అయితే ఎంపీ విషయానికి వచ్చే సరికి 60వేల ఓట్లు తగ్గాయి. 2012 ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మేకపాటికి రెండేళ్ల తేడాతో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల కన్నా 60వేల ఓట్లు తక్కువ రావడం గమనిస్తే అప్పటికే మేకపాటిపై జనానికి మోజు తగ్గినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో వైసీపీకి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కనిపించిన అనుకూలతలు ప్రస్తుతం కనిపించడం లేదు. అప్పుడు వైసీపీ గాలి బలంగా వీస్తోంది. పార్లమెంట్ నియో జకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింటిలో వైసీ పీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో ఆ విధమైన వాతావరణం కనిపించడం లేదు. వైసీపీ నుంచి గెలిచిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీలో చేరిపోయారు.
మేకపాటి కోరి తెచ్చుకున్న మహిధర్రెడ్డి చాలాకాలంగా వైసీపీ క్యాడర్కు దూరంగా ఉన్నారు. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మహీధర్రెడ్డి వైసీపీ క్యాడర్ పట్ల కాస్త కటువుగానే వ్యవహరించారు. 2014 ఎన్నికల తరువాత గత నాలుగేళ్లు ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయించుకోలేక దూరంగా ఉండిపో యారు. చివరికి ఎనిమిదేళ్ళ తరువాత వైసీపీలోకి వచ్చిన ఆయన పట్ల ఆ పార్టీ క్యాడర్లో ఏమంత ఆసక్తి కని పించ డం లేదు. మంత్రిగా చేసిన అభివృద్ధి పనులతో మహిధర్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరు ఉన్నా, పార్టీ క్యాడర్ మాత్రం ఈయన పట్టుకిందకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మేకపాటి పెద్దగా ఆశించడానికి ఏమీ ఉండదు. గత ఎన్నికల్లో మేకపాటికి బలమిచ్చిన నియోజకవర్గాల్లో ఆత్మకూరు ఒకటి.
చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థి ఖరారు కావడం, బలమైన పోటీ ఇవ్వలేకపోవడం మేకపాటికి గెలుపునకు అనుకూ లించిన ప్రధానాంశం. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. నాయకుల మోసంతో ఆ నియోజకవ ర్గ టీడీపీ క్యాడర్ కసిగా పనిచేయడానికి సిద్ధమవుతోంది. అభ్యర్థి విషయం లోనూ టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగేస్తోంది. వీలైనంత త్వరలో నియోజకవర్గ ఇన్చార్జిని ప్రకటించ నుంది. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల నాటి మెజారిటీని మరోసారి ఊహించడం కష్టమే. అయినప్పటికీ.. గెలుపు మాత్రం మళ్లీ మేకపాటిదేనని అంటున్నారు ఆయన అనుచరులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.