టీడీపీ సీనియర్ నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. ఆయన ఇప్పటికే చాలా తప్పులు చేశారని, అవే ఆయనను ఓడించేందుకు రెడీ అవుతున్నాయని సొంత పార్టీలోని కొందరు నేతలు హెచ్చరిస్తుండడం గమనార్హం. నిజానికి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు అత్యంత విధేయుడు, సన్నిహితుడు, మంత్రి వర్గంలో నెంబర్ 5లో కొనసాగుతున్న వారు అయిన దేవినేనిపై ఎందుకు ఈ కామెంట్లు వస్తున్నాయి? ఆయన నిజంగానే ఓటమి దిశగా పయనిస్తున్నాడా? వంటి కీలక అంశాలు తెరమీదికి వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దేవినేని ఉమాకు చంద్రబాబు తన కేబినెట్లో జలవనరుల శాఖను కట్టబెట్టారు. అంతేకాదు, ప్రాజెక్టుల పై అధ్యయనం కూడా చేయించారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రధానంగా ఎడాప్ట్ చేసుకోవడం, 2019 ఎన్నికలకు దానినే ఓ ఆయుధం గా వాడుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే, ఇది పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని గ్రహించి పట్టిసీమను నిర్మించేందుకు రెడీ అయింది. అయితే, ఈ ప్రాజెక్టును పూర్తిగా దేవినేని చేతుల్లోనే పెట్టారు చంద్రబాబు ఇలా అన్ని విధాలా దేవినేనికి బాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే ఇప్పుడు పార్టీని ముంచిందని అంటున్నారు పార్టీలోని సీనియర్లు. తనకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యాన్ని దేవినేని అడ్వాంటేజ్గా తీసుకున్నాడని, దీంతో పార్టీలోని చాలా మందిని ఆయన చిన్న చూపు చూశారని, ఫలితంగా ఇప్పుడు ఎన్నికల సమయంలో దాని ప్రభావం పార్టీపై పడుతోందని అంటున్నారు.
దేవినేని మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచే టికెట్ను ఆశిస్తున్నారు. అయితే, ఈయన గెలుపు అంత ఈజీ కాదని తేలిపోతోంది. ఇక్కడి స్థానిక టీడీపీ నేతలే దేవినేనికి వ్యతిరేకంగా చాపకింద నీరులా ప్రచారం చేయనున్నారని, దేవినేనికి వ్యతిరేకంగా ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ క్యాంపెయిన్ నడుస్తోందని అంటున్నారు.
అవినీతిలో ఫస్ట్ ఉన్న దేవినేనికి ఓటు వేయొద్దు.. పట్టిసీమతో దేవినేని పొట్ట నింపుకున్నాడు! వంటి స్లోగన్లను ఇప్పటికే వాట్సాప్ మెసేజ్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఇక్కడ వైసీపీ తరఫున బలమైన నాయకుడుగా వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగుతుండడం కూడా దేవినేనికి వ్యతిరేక అంశంగా మారిపోతోంది. వసంత ఫ్యామిలీ టీడీపీ నుంచే వచ్చి ఉండడం, కమ్మసామాజిక వర్గాన్ని అన్ని విధాలా ఆకర్షించడం వంటి కీలక అంశాలు దేవినేనికి మైనస్గా మారనున్నాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.