కాపుల రిజర్వేషన్లపై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాపులను బిసిల్లోకి చేర్చే అంశం కేంద్రప్రభుత్వ పరిధిలోనిదే కానీ తన చేతిలో లేదని జగ్గంపేట బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు. రిజర్వేషన్లపై జగన్ ప్రకటన వచ్చినప్పటి నుండి కాపుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. జగన్ చెప్పింది నిజమే అంటూ మద్దతుదారులు చెబుతుండగా కేంద్రంపై పోరాడి తమకు రిజర్వేషన్లు సాధించాల్సిందిపోయి చేతులెత్తేశారంటూ మరికొందరు మండుతున్నారు.
కాపుల్లో ప్రతికూలమేనా ?
జగన్ ప్రకటనపై ఎవరి స్పందన ఎలాగున్నా కాపుల రిజర్వేషన్ అంశం వచ్చే ఎన్నికల్లో కీలక అంశంగా మారే అవకాశాలే ఎక్కువ. ఈ పరిస్ధితుల్లో జగన్ చేసిన స్పష్టమైన ప్రకటన వల్ల కాపుల్లో కొంత వరకూ ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలే ఎక్కువ. జగన్ అధికారంలోకి రావాలంటే కాపుల మద్దతు చాలా అవసరం. అందునా ఉభయగోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గ ప్రభావం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోయిన ఎన్నికల్లో పై రెండు జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో వైసిపికి వచ్చింది కేవలం 7 స్ధానాలు మాత్రమే.
జగన్ కల నెరవేరాలంటే ?
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలుగంటున్న జగన్ మొన్నటి వరకూ కాపుల రిజర్వేషన్ అంశంపై జాగ్రత్తగానే ఉన్నారు. మరి కారణమేంటో తెలీదు కానీ కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయం తన చేతిలో లేదని ప్రకటించారు. దాంతో వైసిపిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్ధానాలు సాధిస్తే కానీ జగన్ కల నెరవేరే అవకాశం లేదు.
కాపులకన్నాబిసిలే ఎక్కువ
అదే సందర్భంలో కాపుల రిజర్వేషన్ విషయంలో జగన్ ప్రకటించిన స్పష్టమైన వైఖరి వల్ల బిసిల్లో సానుకూలమయ్యే అవకాశాలు కనబడుతోంది. కాపులను బిసిల్లో చేర్చే విషయంలో బిసి సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయమై గతంలోనే చంద్రబాబుపై బిసి నేతలు మండిపడిన సంగతి అందరికీ తెలిసిందే. జనాభా రీత్యా చూసినా, ఓట్ల పరంగా చూసినా కాపులకన్నా బిసిలే ఎక్కువ. కాపులను బిసిల్లో చేరుస్తానని చెప్పినందుకే చంద్రబాబుపై బిసిల్లో బాగా వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో బిసిలు టిడిపి విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.
జగన్ కు బిసిల్లో ప్లస్సేనా ?
ఈ నేపధ్యంలోనే రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే జగన్ కాపు రిజర్వేషన్లపై తన వైఖరిని బయటపెట్టుండవచ్చు. మొదటిది వచ్చే ఎన్నికల్లో బిసిల మద్దతును కూడగట్టటం. ఇక రెండోది కాపులు ఎటూ జనసేన వైపే మొగ్గుచూపుతారు కాబట్టి రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా ఉంటే మంచిదని అనుకుని ఉండొచ్చు. పైగా కాపుల ప్రభావం సుమారు 60 నియోజకవర్గాల్లో మాత్రమే ఉంటుంది. అదే బిసిలైతే మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ఉంది. ఏ అభ్యర్ధి గెలవాలన్నా ఏదో ఒక్క సామాజికవర్గం ఓట్లు వేసినంత మాత్రాన సరిపోదు. కాబట్టి రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి వల్ల పై రెండు అంశాల్లో ఏది జరిగినా జగన్ కు పెద్ద ప్లస్సే అవుతుంది.