కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభం మాటలు విచిత్రంగా ఉంటున్నాయి. కాపులకు బిసి రిజర్వేషన్లు ఇవ్వటం రాష్ట్ర పరిధిలోని లేని అంశమని అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని జగ్గంపేట బహిరంగసభలో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించటం తన చేతిలో లేని పనని అని చెప్పటమే జగన్ చేసిన తప్పైంది. రిజర్వేషన్లపై పోయిన ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చిన చంద్రబాబునాయుడు, ముద్రగడకు విశ్వసనీయ నేతగా ముద్రగడ కనిపిస్తున్నారు ఇపుడు. కాపు రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నా జగనే అడ్డుకుంటున్నారనే స్ధాయిలో ముద్రగడ మాట్లాడుతున్నారు.
కాపులను జగన్ మోసం చేశారా ?
ముద్రగడ తాజాగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి రిజర్వేషన్లు కల్పిస్తాడేమోన్న ఉద్దేశ్యంతోనే జగన్ అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. ఒక వైపు సామాజికవర్గంలోని కొందరు నేతలేమో చంద్రబాబు కాపులను మోసం చేశాడంటూ మండిపడుతున్నారు. నిజానికి రిజర్వేషన్ కల్పించటం ముఖ్యమంత్రి చేతిలో లేని పని అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక కులాన్ని రిజర్వేషన్ క్యాటగిరీలో కలపాలన్నా, తొలగించాలన్నా కేంద్రప్రభుత్వం మాత్రమే చేయగలదు. అదికూడా సుప్రింకోర్టు అడ్డుపడకుండా ఉంటేనే. అందరికీ తెలిసిన విషయం ముద్రగడకు తెలీకుండానే ఉంటుందా ?
తప్పుడు హామీలిచ్చింది చంద్రబాబు కాదా ?
కాపులను బిసిల్లో చేర్చే అంశం ఇప్పటిది కాదు. దశాబ్దాల పాటు ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అయినా ఎవరూ కాపులకు హామీ ఇవ్వలేదు. అయితే, రాష్ట్ర విభజన జరగటం, అప్పటికే పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చోవటం చంద్రబాబుకు ఇబ్బందిగా ఉంది. 2014లో గనుక అధికారంలోకి రాకపోతే భవిష్యత్తులో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే అధికారం అందుకోవటమే ఏకైక లక్ష్యంతో ఆచరణ సాధ్యం కాదని తెలిసినా నోటికొచ్చిన హామీలన్నింటినీ ఇచ్చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించటం కూడా అటువంటి హామీల్లో ఒకటి.
కాపులంటే జగన్ కు చిన్న చూపా ?
వాస్తవాలు ఈ విధంగా ఉంటే ముద్రగడ ఆరోపణలు మాత్రం వేరే విధంగా ఉంది. కాపు జాతిపై జగన్ కు చిన్న చూపెందుకో చెప్పాలంటూ మండిపడుతున్నారు. కాపులను ఆదుకోవటానికే కార్పొరేషన్ కు ఇప్పటికన్నా రెట్టింపు నిధులిస్తానని చేసిన ప్రకటన ముద్రగడ పట్టించుకోవటం లేదు. కాపు జాతి ఏం తప్పుచేసిందో చెప్పాలంటూ జగన్ ను ముద్రగడ నిలదీయటం విచిత్రంగా ఉంది. రిజర్వేషన్ల విషయంలో వాస్తవాన్ని చెప్పారేకానీ రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని ఎక్కడా జగన్ చెప్పలేదు.
సింఎ అవ్వటం జగన్ చేతిలో పనా ?
కాపులకు రిజర్వేషన్ కల్పించటం కేంద్రం పరిధిలోని అంశమని జగన్ నిజాన్ని చెప్పటమంటే కాపులను అవమానించటం ఎలాగవుతుందో ముద్రగడే చెప్పాలి. కాపు ఉద్యమం పుట్టిన గడ్డమీదే జగన్ కాపులను అవమానపర్చటం దారుణమని ముద్రగడ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. పైగా జగన్ ముఖ్యమంత్రి కావాలన్న పదవీకాంక్షను వదిలేస్తే తమ జాతి రిజర్వేషన్ల ఆకాంక్షను వదిలుకుంటామంటూ పెద్ద బేరమే పెట్టారు. ముఖ్యమంత్రి కావటం జగన్ చేతిలో లేదన్న విషయం ముద్రగడ మరచిపోయినట్లున్నారు. జనాలు ఓట్లేస్తేనే జగన్ అధికారంలోకి వస్తారన్న చిన్న విషయాన్ని మరచిపోయారు. మొత్తం మీద ముద్రగడ వ్యాఖ్యలు, జగన్ పై ఆరోపణలు చూస్తుంటే చంద్రబాబుకు మద్దతివ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.