వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెండు విషయాల్లో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ? అవుననే అంటున్నారు కాపు నేతలు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు అసందర్భంగా చేసిన రెండు ప్రకటనలు జగన్ కు బాగా నష్టం చేసేవే అనటంలో సందేహం లేదని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం స్పష్టంగా చెప్పారు.
పవన్ గురించి మాట్లాడి తప్పు చేశారా ?
జగన్ ప్రకటనలపై గాళ్ళ మాట్లాడుతూ, మొదటిది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలను మాట్లాడటాన్ని ప్రస్తావించారు. పెద్దాపురంలో మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు జగన్ బదులిస్తూ కార్లను మార్చినంత ఈజీగా పవన్ కల్యాణ్ పెళ్ళాలని మారుస్తారంటూ కామెంట్ చేశారు. నిజానికి పవన్ మూడు వివాహాలు చేసుకున్న విషయం జనాలకందరికీ తెలిసిందే. అందులో కొత్త కూడా ఏమీ లేదు. అయితే, అదే విషయాన్ని జగన్ లాంటి నేత ప్రస్తావిస్తాడని ఎవరూ ఊహించలేదు. అదే విషయాన్ని గాళ్ళ తప్పుపట్టారు. పవన్ పై రాజకీయ, సిద్ధాంత పరమైన ఆరోపణలు, విమర్శలు చేయటం వదిలేసి వ్యక్తిగత విషయాలను మాట్లాడటం తప్పన్నారు.
కేంద్రంతో పోరాడి సాధిస్తానని చెప్పుండాల్సింది
ఇక, రెండో అంశంగా కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయాన్ని ప్రస్తావించారు. కాపులకు రిజర్వేషన్ కల్పించటం తన చేతిలో లేని అంశమని జగన్ చెప్పటాన్ని గాళ్ళ తప్పుపట్టారు. రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనిదని జగన్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆ విషయం అందరికీ తెలుసన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై కేంద్రప్రభుత్వంతో పోరాడుతానని జగన్ చెప్పుంటే బాగుండేదని గాళ్ళ అభిప్రాయపడ్డారు. కాపుల అంశంపై జగన్ వైఖరి స్పష్టమైన నేపధ్యంలో మిగిలిన సామాజికవర్గాలు ముఖ్యంగా బిసిల్లో ఏ విధమైన సానుకూలత ఉంటుందనే విషయం ఇపుడే చెప్పలేమని గాళ్ళ సుబ్రమణ్యం అన్నారు.