తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ చూసినా డీఎంకే అధినేత కరుణానిధి గురించే టాపిక్ నడుస్తుంది. మూడు రోజుల నుంచి కరుణానిధి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని..ఈరోజూ..రేపు అన్నట్లు ఉన్నారని రూమర్లు రావడంతో డీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కరుణానిధి గురించి తమకు వాస్తవాలు తెలియాలని ఆసుపత్రి వద్ద హడావుడి చేశారు.
తాజాగా చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సేలంకు వెళ్లిన పళనిస్వామి, నేటి అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని చెన్నై వచ్చారు. ఐసీయూలో ఉన్న కరుణానిధిని చూసి వచ్చిన పళనిస్వామి, ఆసుపత్రి వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
అధినేత కరుణానిధి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని... ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కరుణానిధిని పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కరుణానిధిని ఇప్పుడే కలిశానని... ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అన్నారు. మరోవైపు, కరుణ అనారోగ్యం నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఆసుపత్రి బయట భారీ సంఖ్యలో ఉన్న డీఎంకే కార్యకర్తలు, నేతలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ఎవరూ వినని పరిస్థితి నెలకొంది.