తెలుగుదేశంపార్టీతో పెట్టుకుంటే ఎలాగుంటుందో పవన్ కల్యాణ్ కు ఇపుడు బాగా అర్ధమవుతోంది. నాలుగేళ్ళపాటు టిడిపితో అంటకాగినంత కాలం పవన్ ను దేవుడన్నారు. ఎప్పుడైతే తేడా వచ్చిందో వెంటనే పవన్ అసలు మనిషేనా అని అడుగుతున్నారు. పైగా పవన్ అసలు మనిషే కాదని తేల్చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ పై ధ్వమెత్తటం అందులో భాగమే.
రాజకీయాలు తెలుసుకోవాలట
చంద్రబాబునాయుడుపై మాట్లాడేటపుడు పవన్ కల్యాణ్ బురదచల్లటం మాని రాజకీయాలు తెలుసుకుని మాట్లాడాలంటూ గట్టి వార్నింగే ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారండోయ్. నాలుగురోజుల క్రితం తూర్పు గోదావరి పర్యటనకు వచ్చిన పవన్ నాలుగేళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మోసం చేసింది బిజెపి అయితే జగన్, పవన్ చంద్రబాబును తిట్టటంపై చింతకాయల మండిపడ్డారు. బిజెపి రాష్ట్రానికి మోసం చేసిందంటున్న అయ్యన్న ఏపికి చంద్రబాబు చేసిన మోసం గురించి మాత్ర మరచిపోయినట్లున్నారు.
మనిషేకాదని తేల్చేశారు
రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబును తిట్టటానికి నోరెలా వచ్చిందంటూ పవన్ పై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబును అనటానికి పవన్ అసలు మనుషేనా అంటూ ధ్వజమెత్తారు. సిఎం కుర్చీ కోసమే జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతున్నారట. చంద్రబాబు ఆరాటం ఎందుకో మరి ? 40 ఏళ్ళకే ఫించన్ ఇస్తానంటూ జగన్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు చేసినట్లన్నమాట. పైగా దొంగలకు, దోపిడిదారులకు రాష్ట్రాన్ని అప్పగిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందంటూ చింతకాయల బోల్డు బాధపడిపోయారు లేండి.