కాపుల రిజర్వేషన్లపై వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మార్చేది లేదంటున్నారట. మూడు రోజుల క్రితం జగ్గంపేట బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ, కాపులను బిసిల్లో చేర్చే అంశం రాష్ట్రం పరిధిలోని అంశం కాదన్నారు. కేంద్రం పరిధిలోని అంశంపై తాను హామీ ఇవ్వలేనంటూ ప్రకటించారు. అప్పటి నుండి రాష్ట్రంలో పెద్ద వివాదం మొదలైంది.
తన ప్రకటనపై సమీక్షించిన జగన్
తాజాగా ఇదే విషయమై పార్టీ నేతలు మాట్లాడుతూ, రిజర్వేషన్లపై తాను మాట మార్చేది లేదని జగన్ నేతలతో స్పష్టం చేశారట. జగన్ చేసిన ప్రకటనపై రాష్ట్రంలో మొదలైన వివాదం గురించి నేతలతో జగన్ సమీక్షించారట. ఆ సందర్భంగా జగన్ చెప్పిందాట్లో తప్పేమీ లేకపోయినా చెప్పే విధానంలోనే తప్పుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారట. రిజర్వేషన్ల కోసం కేంద్రంతో పోరాటం చేస్తానని చెప్పి ఉంటే బాగుండేదని నేతలు అన్నపుడు జనాలను తప్పుదోవ పట్టించటం ఎందుకంటూ జగన్ ఎదురు ప్రశ్నించారట.
జనాలు వాస్తవాన్ని గ్రహిస్తారు
పోయిన ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి తప్పిన విషయాన్ని జగన్ నేతలకు గుర్తు చేశారట. కేంద్రం ఒప్పుకున్నా గుజరాత్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో ఇచ్చిన రిజర్వేషన్లను సుప్రింకోర్టు ఇటీవల కొట్టేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారట. తన ప్రకటనపై జనాల్లో క్లారిటీ ఉందని కాకపోతే చంద్రబాబు అండ్ కో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు జగన్ అభిప్రాయపడ్డారట. ఇపుడు కాకపోయినా ఎన్నికల సమయానికైనా తమ ప్రకటనలోని వాస్తవాన్ని జనాలు పూర్తిగా అంగీకరిస్తారని జగన్ గట్టిగా చెప్పారట.