సాధారణ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రధానపార్టీలైన తెలుగుదేశంపార్టీ, వైపిపి అధినేతల్లో అయోమయం పెరిగిపోతోంది. వీరిద్దరిలో అయోమయం పెరిగిపోవటానికి ప్రధాన కారణం జనసేన అధినేత పనవ్ కల్యాణ్ అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఏ సామాజికవర్గానికి టిక్కెట్లిస్తే ఫలితం ఎలాగుంటుందో చంద్రబాబు, జగన్ సరిగా అంచనా వేయలేకపోతున్నారు.
కాపులదే అధిక ప్రభావం
19 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలోని చాలా స్ధానాల్లో కాపు సామాజికవర్గం ప్రభావం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. పవన్ ది కూడా కాపు సామాజికవర్గమే అన్న విషయం అందరికీ తెలిసిందే. రేపటి ఎన్నికల్లో గెలుపోటములు ఎలాగున్నా జిల్లాలోని కాపుల్లో అత్యధికులు ప్రస్తుతం జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో రేపటి ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేన తరపున పోటీ చేసే వారిలో అత్యధికులు కాపు సామాజికవర్గం అభ్యర్ధులే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో తమ పార్టీల తరపున పోటీలోకి దింపాల్సిన అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు, జగన్ లో గందరగోళం మొదలైంది.
కాపుల్లో అత్యధికులు జనసేన వైపే మొగ్గా ?
జనసేనతో పాటు టిడిపి, వైసిపిలు కూడా కాపులకే టిక్కెట్లు ఇచ్చినా మెజారిటీ ఓటర్లు జనసేన తరపున పోటీ చేసే అభ్యర్ధులవైపే మొగ్గు చూపుతారనే ప్రచారం జరుగుతోంది. దాంతో జనాలు ఎటూ జనసేన అభ్యర్ధులవైపే మొగ్గు చూపేటపుడు తమ పార్టీల తరపున కూడా కాపులకే ఎందుకు టిక్కెట్లు ఇవ్వాలన్న ప్రశ్న మొదలైంది. జనసేన కాపులను నిలబెట్టే నియోజకవర్గాల్లో కాపుల తర్వాత అత్యధిక ఓటర్లుండే సామాజికవర్గాల తరపున అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచన చేస్తున్నాయి టిడిపి, వైసిపిలు. మరి ఈ కసరత్తు ఏ మేరకు సానుకూలమవుతుందో ఇపుడే చెప్పలేరు.
11 నియోజకవర్గాల్లో బాగా టైట్ ఫైట్
జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో రాజోలు, అమలాపురం, పి. గన్నవరం ఎస్సీ రిజర్వుడు కాగా రంప చోడవరం ఎస్టీ నియోజకవర్గం. అంటే మిగిలింది 15 నియోజకవర్గాలు. వీటిల్లో కూడా మెట్ట ప్రాంతంలోని పిఠాపురం, ప్రత్తిపాడు, తుని, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో కాపుల ప్రాభల్యం అత్యధికం. ఇక, కోనసీమ ప్రాంతంలోని అమలాపురం, కొత్తపేట, ముమ్మడివరం, రామచంద్రాపురంలో బిసిలు అధికం. అనపర్తిలో రెడ్లు, మండపేటలో కమ్మ సామాజికవర్గనిదే పై చేయి. ఇక, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కాకినాడ అర్బన్ , కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో బిసిలు, కాపులు కాస్త అటు ఇటుగా ఉంటారు.
జనసేన అభ్యర్ధులపైనే టిడిపి, వైసిపిల నిర్ణయం
మొత్తం మీద రిజర్వుడు నియోజకవర్గాలు నాలుగు, మండపేట, అనపర్తి ఓసి నియోజకవర్గాలను వదిలేస్తే మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రధానంగా కాపు, బిసిలదే ఆధిపత్యం. కాబట్టి పై రెండు సామాజికవర్గాల నుండి అత్యధికంగా అభ్యర్ధులుండే అవకాశాలున్నాయి. వైసిపి తరపున తునిలో దాడిశెట్టి రాజా, కొత్తపేటలో జగ్గిరెడ్డి ఎంఎల్ఏలుగా ఉన్నారు. కాబట్టి వారికి టిక్కెట్లు ఖాయం. మిగిలిన నియోజకవర్గాల్లో టిక్కెట్ల విషయంలోనే జగన్ ఆలోచించాలి. అదే విధంగా రాజమండ్రిలో బిజెపి సిట్టింగ్ ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణ ఉన్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో టిడిపి సిట్టింగులే ఉన్నారు. వీరిలో వచ్చే ఎన్నికల్లో ఎంతమందికి చంద్రబాబు టిక్కెట్లు ఇస్తారో చూడాలి. ఒకవేళ అభ్యర్ధులను మార్చాలి అనుకున్న స్ధానాల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారట. జనసేన ప్రకటించే అభ్యర్ధుల ఆధారంగా పై రెండు పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశాలున్నాయి.