ఈ మద్య దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలనం రేపింది. కేవలం మూఢనమ్మకాలతోనే అంతమంది ఆత్మహత్యలు చేసుకున్నాట్లు పోలీసు దర్యాప్తులోని సమాచారం. తాజాగా ఢిల్లీలోని ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనను మరువకముందే జార్ఖండ్లోని రాంచీలో అటువంటి ఘటనే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంచీకి చెందిన దీపక్ ఝా(40), అతని భార్య సోనీ ఝా, రూపేష్ ఝా, దీపక్ కుమార్తె దృష్టి(7), గంజుతోపాటు మరో ఇద్దరు రాజధానిలోని కంకె పోలీస్స్టేషన్ ప్రాంతంలోని వారి నివాసంలో ఉరివేసుకుని సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు.దీపక్ ఝా సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించి అప్పుల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది. వారి ఆత్మహత్యలకు అదే కారణంగా తెలుస్తోంది. ఈ నెల మొదట్లో ఇదే రాష్ట్రంలోని హజారీబాగ్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కూడా ఇదే విధంగా సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగానే వీరంతా తనువు చాలించారని నివేదికల్లో తేలింది. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యలుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీపక్ కుమార్తె కోసం స్కూలు బస్సు వచ్చి ఆగినా ఇంటి లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఓ విద్యార్థి బస్సు దిగి తలుపు కొట్టగా అది తెరుచుకుంది. లోపల మృతదేహాలు కనిపించడంతో భయంతో పరిగెత్తుకెళ్లి ఆ విద్యార్థి డ్రైవర్కు చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, జార్ఖండ్లో గత పది రోజుల్లో ఇది రెండో సామూహిక ఆత్మహత్య ఘటన కావడం గమనార్హం.