కర్నూలు జిల్లా పత్తికొండ నుండి వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీలోకి దిగబోయే అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అభ్యర్ధిని ప్రకటించారు. ఇంతకీ ఆ అభ్యర్ధి ఎవరు ? ఇంకెవరు, కె ఇ కొడుకు శ్యాంబాబే పోటీ చేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయేది లేదని కెఇ చాలా కాలంగా చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. నియోజకవర్గంలో తన వారుసునిగా కొడుకు శ్యాంబాబే పోటీ చేస్తారని కూడా చెబుతున్నారు. అయితే అదంతా ఆఫ్ ది రికార్డుగానే సాగుతోంది. శ్యాంబాబును కెఇ దగ్గరుండి మరీ ప్రమోట్ కూడా చేస్తున్నారు.
కొడుకు పేరు ప్రకటించిన కెఇ
అయితే, తాజాగా నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో కె ఇ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, టిడిపిలో ఎవరికి వారుగా అభ్యర్ధులను ప్రకటించుకునే సంప్రదాయం లేదు. ఆమధ్య కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి, మంత్రి, చంద్రబాబునాయుడు కొడుకైన లోకేష్ కర్నూలు అసెంబ్లీ, ఎంపి అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత జిల్లాలో రేగిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఇంతలోనే కెఇ కూడా లోకేష్ బాటలోనే నడిచి తన వారసుడిని ప్రకటించేశారు.
కోర్టులో కేసు ఎప్పటికి తేలుతుంది ?
ఇంతకీ కెఇ ప్రకటనే ఫైనలా ? కెఇ చెప్పినట్లుగా కెఇ శ్యాం బాబే పోటీ చేస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే, ఆమధ్య జరిగిన వైసిపి సమన్వయకర్త చెరుకుల పాడు నారాయణరెడ్డి హత్యకు సంబంధించిన నిందితుల్లో శ్యాంబాబు కూడా ఉన్నాడు. ఆ కేసు ప్రస్తుతం హై కోర్టు విచారణలో ఉంది. అరెస్టవ్వాల్సిన శ్యాంబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు. రేపటి రోజున కేసు గనుక ఫైనల్ అయి జరగరానిది జరిగితే శ్యాంబాబు భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. ఈరోజు కెఇ కొడుకును అభ్యర్ధిగా ప్రకటించేసినా రేపేం జరుగుతుందో చూడాల్సిందే.
మిగిలింది జనసేన అభ్యర్ధే ?
పత్తికొండ వైసిపి అభ్యర్ధిగా చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిరెడ్డినే ఇక్కడ నుండి పోటీ చేస్తారని జగన్ ఎప్పుడో ప్రకటించేశారు. అప్పటి నుండి శ్రీదేవి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అదే సమయంలో టిడిపి అభ్యర్ధిగా శ్యాంబాబు కూడా అనధికారికంగా నియోజకవర్గాన్ని చుట్టపెట్టేస్తున్నారు. అంటే రెండు ప్రధాన పార్టీల తరపున పై ఇద్దరు పోటీలో ఉండబోయేది దాదాపు ఖాయమనే అనుకోవాలి. అంటే మిగిలింది జనసేన పార్టీ అభ్యర్ధి మాత్రమే.