రాజకీయాల్లో నేటి మిత్రులు రేపటికి శత్రువులు కావొచ్చు. నేడు పక్కపక్కన కూర్చున్న వారు రేపు ఎదురు పడే పరిస్తితి కూడా లేకుండా పోవచ్చు. ఇలా ఉంటాయి రాజకీయాలు. ఇప్పుడు అసలు మేటర్లోకి వస్తే.. వైసీపీ తరఫున గెలిచి.. జగన్కు అన్ని విధాలా అండదండగా ఉంటానని మాటిచ్చి.. అసెంబ్లీలో చంద్రబాబును ఏకేసిన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. పట్టుమని రెండేళ్లు కూడా తిరగకుండానే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి వశమైపోయారు. ఏం జరిగిందో ఏమో.. రాత్రికి రాత్రే ఆయన టీడీపీ సైకిల్ ఎక్కేశారు.
వాస్తవానికి పీఏసీ చైర్మన్ పదవిని జ్యోతులకు ఇవ్వాలని జగన్ భావించారు. అయితే, ఆయన టీడీపీలో చేరే సరికి జగన్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. తనకు వెన్నుపోటు పొడిచినప్పటికీ.. జగన్ ఏనాడూ జ్యోతులపై విరుచుకు పడలేదు. అన్న.. అన్న అంటూనే ఆయనను సంభోదించాడు. అయితే, తాజాగా జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లా జక్కం పేటకు చేరుకున్నాక.. వాస్తవానికి ఈ నియోజకవర్గం తన షెడ్యూల్లో లేకపోయినా.. జగన్.. చివరి నిముషంలో దీనిని తన షెడ్యూల్లో చేర్చుకున్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకోవడం వెనుక జగన్కు రెండు వ్యూహాలు ఉన్నాయి.
వాటిలో ఒకటి నెహ్రూకు తన బలం ఏమిటో చూపించడం, రెండు కాపు లు తన వెంటే ఉన్నారని నిరూపించడం. ఈ రెండు విషయాల్లోనూ జగన్ సక్సెస్ అయ్యాడు. పాదయాత్రంలో 100 వ నియోజకవర్గం జగ్గంపేటలో జగన్ పాదయాత్ర బహిరంగ సభ భారీగా జరిగింది. జనసందోహం మధ్య జగన్ స్పీచ్ అదరగొట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కంచుకోట కూలిపోయేలా వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈ సభకు వచ్చిన జనసందోహం చూసి నెహ్రూకు టెన్షన్ పెరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. తాను పార్టీలో అంతగా నమ్మి పదవి ఇచ్చినా ఆయన తనని కాదని పార్టీమారారు అని జగన్ విరుచుకుపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యేలను అధికార పార్టీ అధినేత 25 నుంచి 30 కోట్ల రూపాయలను ఇచ్చి కొనుగోలు చేశారని… అందులో ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారని జ్యోతులపై జగన్ విరుచుకుపడ్డారు. నైతిక విలువలులేని ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడని పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు., ఈ పరిణామాలు జ్యోతులను తీవ్రంగా కలచి వేస్తున్నాయి. తన నియోజకవర్గంలో జగన్కు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది ? అని ఆయన తల పట్టుకుంటున్నారట! ఇదీ రాజకీయం!! మరి రాబోయే ఎన్నికల్లో జ్యోతులకు ప్రజలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి.