తెలుగుదేశంపార్టీలో రోజు రోజుకు ఇబ్బందికర పరిస్ధితులు పెరిగిపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సమస్యలు సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి వివిధ జిల్లాల్లో టిడిపి నేతలు రోడ్డునపడుతున్నారు. నేతల మధ్య వివాదాలు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు పాకుతుండటం విచిత్రం. నేతల మధ్య పెరిగిపోతున్న వివాదాలను సర్దుబాటు చేయగలిగిన సీనియర్ నేతలు కూడా లేకపోవటం పెద్ద లోటుగా మారిపోయింది. దాంతో ప్రతీ వివాదాన్ని పరిష్కరించాలంటే స్వయంగా చంద్రబాబునాయుడే పూనుకోవాల్సొస్తోంది. అదే పెద్ద సమస్యగా మారిపోయింది.
రాయలసీమ మూడు జిల్లాల్లోనూ గొడవలే
రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని నేతల మధ్య వివాదాలు పెరిగిపోతుంటంతో పార్టీలో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలన్న చంద్రబాబు వ్యూహాలకు నేతల మధ్య వివాదాలు పెద్ద అడ్డంకిగా మారాయి. దాంతో వైసిపికన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకోవటం అటుంచి అసలు పోయిన ఎన్నికల్లో గెలుకున్న 20 సీట్లన్నా వస్తాయా అన్నదే పెద్ద సందేహంగా మారింది.
మంత్రితో ఎవరికీ పడటం లేదు
కర్నూలు జిల్లాను తీసుకుంటే ఏవి సుబ్బారెడ్డి-మంత్రి భూమా అఖిలప్రియ మధ్య వివాదాలు తారస్ధాయికి చేరుకున్నాయి. వీరిద్దరి మధ్య వివాదాలను పరిష్కరించాలని చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. పైగా వీరి వివాదం వల్ల సుమారు మరో మూడు నియోజకవర్గాలపై పడుతోంది. అలాగే, బనగానపల్లి ఎంఎల్ఏ బిసి జనార్ధనరెడ్డికి మంత్రికి కూడా పడటం లేదు. అదే సమయంలో అనంతపురం జిల్లాలో గ్రూపు రాజకీయాల సంగతి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఎంపి జెసి దివాకర్ రెడ్డితో సుమారు ఏడుగురు ఎంఎల్ఏలకు పడటం లేదు.
సర్దుబాటే సాధ్యం కావటం లేదు
అలాగే, కడప జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్-మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డికి ప్రతీ రోజు గొడవలే. మంత్రి ఆదినారాయణరెడ్డికి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డికి ఏమాత్రం పడదు. అదే విధంగా రామసుబ్బారెడ్డికి సిఎం రమేష్ తో పొసగటం లేదు. మొత్తానికి జిల్లాలో కీలకమైన నేతల్లో చాలామంది మధ్య పడటం లేదన్నది వాస్తవం. దాంతో జిల్లా మొత్తం గందరగోళంగా తయారైంది. విచిత్రమేమిటంటే పై జిల్లాల్లోని నేతల మధ్య వివాదాలను సర్దుబాటు చేయటానికి స్వయంగా చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ వినటం లేదు.
కోస్తా జిల్లాల్లోనూ గొడవలే
ఇక, కోస్తా జిల్లాల్లోని ప్రకాశం జిల్లాలో గురించి చెప్పనే అక్కర్లేదు. ఎంఎల్సీ కరణం బలరాంకు ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ తో ఏమాత్రం పడదు. మరో ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ముగ్గురు ఎంఎల్ఏలతో పడదు. చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ తో ఇంకో ఎంఎల్సీ పోతుల సునీతకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పతో ఎంఎల్సీ బొడ్డు భాస్కర్రావుకు పడదు. అలాగే చాలామంది ఎంఎల్ఏల మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఇక, విశాఖపట్నం జిల్లాలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య పచ్చగడ్డి వేయకపోయిన మండిపోతోంది. తాజాగా కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంఎల్ఏ వల్లభనేని వంశీకి ఏమాత్రం పడటం లేదు. ఇటువంటి ఆధిపత్య గొడవలు మరికొందరు ఎంఎల్ఏల మధ్య కూడా ఉన్నాయి. ఒకవైపు ఎన్నికలు ముంచుకువస్తుండటం మరోవైపు గొడవలు పెరిగిపోతుండటంతో టిడిపిలో ఆందోళన పెరిగిపోతోంది.