ప్రజల అనుగ్రహం, ప్రజల ఆశీర్వాదం లేనిదే ఎంతటి వారైనా మట్టికొట్టుకు పోవాల్సిందే. రాజకీయ నేతలకు ఈ విషయం తెలియంది కాదు. ఇప్పుడు చిత్తూరు జిల్లా నగరి రాజకీయాల్లోనూ ఇదే జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీలో చక్రం తిప్పి..చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబ రాజకీయాల్లో టికెట్ చిచ్చు రేపింది. పార్టీకి అత్యంత నమ్మకస్తుడు.. ప్రజల్లో తిరుగులేని నేతగా విరాజిల్లిన నాయకుడు గాలి ముద్దుకృష్ణమ మరణించడంతో ఆయన టికెట్ను ఆయన ఫ్యామిలీకే కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబు ప్రాథమికంగా నిర్దారించుకున్నారు. గత 2014 ఎన్నికల్లో నగరి నియోకవర్గంలో గాలి ముద్దు.. వైసీపీ అభ్యర్థి రోజాపై స్వల్ప ఓట్ల తేడాతో విజయానికి దూరమయ్యారు.
అయినా ఆయన వాయిస్ ఎప్పుడూ పార్టీకి ఉపయోగపడుతూనే వచ్చింది. దీంతో ఆయనను వెను వెంటనే మండలికి పంపారు చంద్రబాబు. అయితే,అనారోగ్య కారణాలతో గాలి మృతి చెందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నగరిటీడీపీ టికెట్ ఆయన ఫ్యామిలీకే ఇవ్వాల్సి వస్తుంది. నమ్మకంగా పనిచేయడం, పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న నేపథ్యంలో గాలి ఫ్యామిలీని కాదలేని పరిస్థితి. అయితే, ఇప్పటికే ఖాళీ అయిన గాలి ఎమ్మెల్సీ సీటును ఆయన సతీమణి సరస్వతమ్మకు కేటాయించిన చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ పై మాత్రం మౌనం వహించారు. దీంతో ఈటి కెట్ తమదంటే తమదని గాలి ఇద్దరు కుమారులు కొట్టుకుంటున్నారు.
అయితే, గాలిజీవించి ఉన్న రోజుల్లో చిన్న కుమారుడిని తన వ్యాపారాలకు వారసుడిగా చేసుకున్న గాలి.. పెద్ద కుమారుడి కి రాజకీయాలు అప్పగించేలా వ్యవహరించారు. నియోజకవర్గంలో రోజూ తిప్పారు. నేతలకు పరిచయం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంలో కిటుకులు నేర్పారు. ఇలా రాజకీయంగా పెద్దకుమారుడు ఎదగాలని ఆశించారు. అయితే, గాలి సతీమణి మాత్రం తన చిన్నకుమారుడు ఎమ్మెల్యే కావలని ఆకాంక్షించారు. ఇది తెలిసిన భాను ప్రకాష్.. వెంటనే రాజకీయంగా తండ్రి నుంచి వచ్చిన అనుభవాన్ని రంగరించి నగరి నియోజవకర్గంలో ర్యాలీ సహా బహిరంగ సభ నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ పరిణామం ఆయనకు ప్లస్ అయింది. అంతేకాదు, రాజకీయంగా తనవెంట ఎవరుఉన్నారు? అనే విషయాన్ని కూడా భాను ఈ సందర్భంగా రుజువు చేసుకున్నారు. ఐదు మండలాల నుంచి యువతను సమీకరించి ర్యాలీ, సమావేశం జరిపారు. సమావేశంలో ఎక్కడా తన గురించి మాట్లాడకుండా, తనకు మద్దతివ్వాలని పిలుపునివ్వకుండా అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ నాయకత్వం గురించే ప్రధానంగా ప్రస్తావించారు. వారి నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతోందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించే ప్రయత్నం చేశారు. వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇలా అధిష్టానాన్ని అన్ని విధాలా ప్రసన్నం చేసుకుని తనకు టికెట్ విషయంలో ఎదురవుతున్న అవరోధాలను ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుండడం గమనార్హం. ఈ పరిణామాన్ని పైనుంచి గమనించి పార్టీ పెద్దలు కూడా భాను సరైన అభ్యర్థని అంటుండడం అతని రాజకీయ భవిష్యత్తుకు మేలు చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.