కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాజకీయంగా వ్యూహాలు మారుస్తున్నారా ? చంద్రబాబునాయుడుతో సన్నిహితమవుతున్నారా ? ముద్రగడ కొడుకు వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేస్తారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు బయలుదేరాయి. మొన్నటి వరకూ తనకు చంద్రబాబునాయుడు బద్ద విరోధి అన్నట్లు వ్యవహరించిన ముద్రగడ తాజాగా సిఎంకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. కాపు రిజర్వేషన్లపై జగ్గంపేట బహిరంగ సభలో జగన్ తన వైఖరి స్పష్టం చేసిన తర్వాత ముద్రగడ రెచ్చిపోవటంతో అసలు విషయం బయటపడిందని ప్రచారం జరుగుతోంది.
జగన్ పై విరుచుకుపడుతున్న ముద్రగడ
ఇంతకీ విషయం ఏమిటంటే, కాపులకు రిజర్వేషన్ అంశం కేంద్రపరిధిలోనిదే కానీ రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిది కాదన్నది జగన్ ప్రకటన సారాంసం. వాస్తవానికి జగన్ నిజమే చెప్పారు. ఆశ్చర్యంగాఅప్పటి నుండి జగన్ పై ముద్రగడ రెచ్చిపోతున్నారు. కాపులను జగన్ మోసం చేశారంటూ ముద్రగడ మండిపోతున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పింది జగన్ కాదు చంద్రబాబు. ఆరు మాసాల్లో కాపులను బిసిల్లో చేరుస్తానంటూ పోయిన ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పింది చంద్రబాబన్న విషయం అందరికీ తెలిసిందే.
చంద్రబాబుకు అనుకూలంగా
జగ్గంపేటలో తన వైఖరి స్పష్టం చేసినందుకు, వాస్తవ పరిస్దితిని వివరించినందుకు అభినందించాల్సిన ముద్రగడ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటో అర్ధంకాలేదు. కాపులను చంద్రబాబు మోసం చేశారని అందరూ అంటుంటే ముద్రగడ మాత్రం తనకు చంద్రబాబుపై నమ్మకం ఉందని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదని ఒకవైపు యనమల రామకృష్ణుడు కూడ జగన్ ప్రకటనకే మద్దతు ఇచ్చినట్లుగా మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీనే జగన్ కు మద్దతుగా మాట్లాడినపుడు ముద్రగడ జగన్ ను తప్పు పడుతు చంద్రబాబుకు మద్దతుగా ఎందుకు మాట్లాడుతున్నారు ?
టిడిపి నుండి ముద్రగడ కొడుకు పోటీ
కాపు సామాజికవర్గంలోని నేతల సమాచారం ప్రకారం ముద్రగడను టిడిపిలోకి లాక్కోవాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారట. అందులో భాగంగానే ముద్రగడ రెండో కొడుకు ముద్రగడ గిరికి కాకినాడ ఎంపిగా కానీ లేకపోతే పిఠాపురం ఎంఎల్ఏగా పోటీ చేయించేందుకు చంద్రబాబు టిక్కెట్టు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, ముద్రగడ స్పందన ఏమిటన్నది ఇంకా తేలలేదు. కాకపోతే జనాలే ఏ విధంగాఆ రిసీవ్ చేసుకుంటారో చూడాలి.