వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పిఠాపురంలో ఈరోజు ఉదయం సన్మానం చేశారు. రెండు అంశాల్లో స్పష్టత ఇచ్చినందుకు జగన్ కు సన్మానం చేసినట్లు పిఠాపురంలోని కాపు నేతలు చెబుతున్నారు. మొదటిదేమో కాపు కార్పొరేషన్ కు రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినందుకు. ఇక రెండోదేమో బిసిలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించని కాపుల రిజర్వేషన్లకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినందుకు.
వాస్తవం చెప్పిన జగన్
జగ్గంపేటలో జగన్ మాట్లాడుతూ, కాపుల రిజర్వేషన్ అంశం రాష్ట్రపరిధిలోనిది కాదని చెప్పారు. కేంద్రపరిధిలోని అంశానికి తాను హమీ ఇచ్చి కాపులను తప్పుదోవ పట్టించనంటూ జగన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే జగన్ ప్రకటన చేశారో అప్పటి నుండి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభం లాంటి వాళ్ళు కొందరు మండిపడుతున్నారు. కాపుల రిజర్వేషన్ కు జగన్ వ్యతిరేకమంటూ ముద్ర వేసేస్తున్నారు.
జగన్ కు కాపుల మద్దతు
ఇటువంటి నేపధ్యంలోనే అనూహ్యంగా కాపు నేతల్లో కొందరు జగన్ కు మద్దతుగా నిలబడ్డారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి జగన్ పాదయాత్ర పిఠాపురంకు చేరుకోగానే పలువురు కాపు యువకులు పెద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్ కు తమ మద్దతు పలికారు. కాపు కార్పొరేషన్ కు రూ. 10 వేల కోట్ల నిధుల కేటాయింపుపై హామీ ఇచ్చినందుకు ధన్యవాదులంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. బిసిలకు ఇబ్బందులు కలగకుండా కాపుల రిజర్వేషన్లకు తాను మద్దతు ఇస్తానని జగన్ ప్రకటించటాన్ని స్వాగతిస్తూ పలువురు కాపు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం జగన్ ను కలిసి సన్మానం కూడా చేశారు. దాంతో జగ్గంపేట బహిరంగ సభ తర్వాత జరిగిన డ్యామేజిని కొంత వరకూ కంట్రోలు చేసేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తున్నట్లే కనబడుతోంది.