పచ్చగా కళకళ లాడుతున్న రాష్ట్రాన్ని ముక్కలు చేసినందుకు తగిన మూల్యాన్నే చెల్లిస్తోంది. మెజారిటీ జనాల మనోగతానికి విరుద్ధంగా అందులోనూ అడ్డుగోలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేసింది. చేసిన పాపం ఊరికేపోతుందా ? అన్నది పెద్దలు చెప్పే ఓ సామెత. ఆ పాపమే కాంగ్రెస్ ను విభజిత ఏపిలో వెంటాడుతోంది. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన 175 మంది అభ్యర్ధుల్లో ఏ ఒక్కరికీ కనీసం డిపాజిట్ కూడా దక్కలేదన్న విషయం అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్ వల్లే ప్రత్యేకహోదా సాధ్యమట
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, వచ్చే ఎన్నికల్లో సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకహోదాకు కాంగ్రెస్ వల్లే సాధ్యమని , కాపుల రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతుండటం చూస్తుంటే నవ్వు వస్తోంది. ఆ మధ్య ఏపి వ్యవహారా ఇన్చార్జి ఊమెన్ చాంది, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ కు 25 ఎంపి స్ధానాల్లో గెలిపిస్తే కానీ ఏపికి ప్రత్యేకహోదా రాదని పెద్ద జోక్ చేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది.
కాపు రిజర్వేషన్లకు పార్టీ కట్టుబడి ఉందట
తాజాగా కేంద్ర మాజీ మంత్రి పళ్ళం రాజు మాట్లాడుతూ, కాపుల రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందంటూ మరో కామెడి చేశారు. అంతేకాదండోయ్, కాంగ్రెస్ ను విడిచిపెట్టేసిన వారంతా తిరిగి పార్టీలోకి వచ్చేస్తారని ధీమా వ్యక్తం చేయటం గమనార్హం. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి రావాలి ? ఎప్పుడు ప్రత్యేకహోదా, ఎప్పుడు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి ? ముందు ఏపిలో పది సీట్లు తెచ్చుకుంటే అదే పదివేలు.