సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాడ బోనాల జాతరలో జోగిని శ్యామల కంటతడిపెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్థాలు కూడా పెట్టింది. అయితే దీని మీద శ్యామల స్పందించారు. తాజాగా.. ఈఓ అన్నపూర్ణ ఆహ్వానం మేరకు మహంకాళి ఆలయానికి వచ్చిన ఆమె, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈఓ, శ్యామలతో పూజలు చేయించి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..నా వ్యాఖ్యల వెనుక ఆవేదన ఉందే తప్ప.. ఉద్దేశ పూర్వకంగా ఎలాంటి విమర్శలూ చేయలేదు.
దయచేసి ఎవరూ అపార్థం చేసుకోవద్దు’ అని శ్యామల చెప్పారు. తన మాటలను అపార్థం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరారు. మెయిన్ గేట్ వద్ద జరిగిన ఘటన తనను మనస్తాపానికి గురి చేసిందని తన మాటలను అపార్థం చేసుకోవద్దన్నారు. అనంతరం ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ.. బోనాల జాతర సందర్భంగా బోనం సమర్పించేందుకు జోగిని శ్యామల వచ్చినట్లు తమకు తెలియదని వెల్లడించారు.
కాగా, మహిళలు ఒక్కొక్కరు దాదాపు 10-14కిలోల బరువు బోనంతో లైనులో నిల్చున్నారని, అయినా అవేమీ పట్టించుకోకుండా వీఐపీలు వస్తున్నారంటూ గంటలతరబడి భక్తుల క్యూలైన్లు ఆపేశారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ కంటతడి పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను ఆలయానికి పిలిపించిన ఈఓ... శ్యామలతో పూజలు చేయించి ప్రసాదాన్ని అందించారు.