అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు తెలంగాణా మంత్రి కేటీయార్. పార్టీ మూల సిధ్ధాంతాలను మూలకు తోసేసి మరీ చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడంటూ ఈ రోజు కేటీయార్ అటాక్ చేశారు. నిజానికి టీడీపీకి సిధ్ధాంతపరంగా కాంగ్రెస్ బద్ద విరోధి అని, అయితే బాబు మాత్రం కేవలం స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలసిపోయేందుకు పరితపిస్తున్నారన్నారు కేటీయార్. ఉన్నటుండి ఇలా కేటీయార్ బాబును టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా చర్చనీయమవుతున్నాయి.
బలపడుతున్న బంధం :
నిజానికి నాలుగు నెలల ముందు బీజేపీకి టీడీపీ రాం రాం అన్న దగ్గర నుంచి కాంగ్రెస్ కు బాబు కన్ను కొడుతూనే ఉన్నారు. పనిగట్టుకుని మరీ ఆయన కర్ణాటక వెళ్ళడం వెనక కూడా పొత్తులు జిత్తులే ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. ఈ మధ్యన కాంగ్రెస్ పై బాబు తీరు బాగా మారింది కూడా. బీజేపీ కంటే ఆ కాంగ్రెస్ చాల నయం అంటూ వస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో కేటీయార్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి.
అవిగో సంకేతాలు :
బాబు ఎపుడైతే రూట్ మార్చారో దానికి సంకేతంగా అనుకూల మీడియాలో కాంగ్రెస్ ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. ఏపీలో ఒక్క సీటూ లేని కాంగ్రెస్ కి మొదటి పేజీలలో కవరేజ్ ఇస్తూ రేపటి ఎన్నికలలో ఏదో పొడిచేస్తున్నంతగా ప్రచారం చేస్తున్నాయి.
కొన్ని పత్రికలు, చానల్స్. మరో వైపు తెలంగాణాలో వచ్చే ఎన్నికలలో మేమే కింగ్ మేకర్స్ అవుతామంటూ ఆ పార్టీ అధ్యక్షుడురమణ రెండు రోజుల క్రితం ప్రకటించడం, మరో వైపు ఏపీ తెలగాణా కాంగ్రెస్ నాయకులు కూడా తమ శత్రువుగా టీయారెస్, వైసీపీని చూడడం వంటి పరిణామాల నేపధ్యంలో కేటీయార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాబోయే రోజులలో మరింతగా హస్తంతో టీడీపీ దోస్తీ బయట పడుతుందని అంటున్నారు.