రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైతే కాపుల రిజర్వేషన్ అంశం రాజుకుందో అప్పటి నుండి అందరినీ ఒక అంశం పట్టి పీడిస్తోంది. ఇంతకీ అదేమిటంటే, రాబోయే ఎన్నికల్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రభావం ఎంత ? ముద్రగడకు ఎందుకంత ప్రాధాన్యత ఉంది ? అంటే, కాపులకు బిసి రిజర్వేషన్ వర్తింపచేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చింది తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలోనే. కాపుల ప్రాభల్యం బాగా ఎక్కువుంది అదే జిల్లాలోనే. అందులోనూ మాజీ మంత్రి ముద్రగ పద్మనాభంది అదే జిల్లా కాబట్టే. చివరగా ఇచ్చిన హామీని అమలు చేయటంలో చంద్రబాబు విఫలమైనపుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది ముద్రగడ కాబట్టే.
హైలైట్ అయిన ముద్రగడ
నిజానికి కాపులకు తానొకడే నాయకుడనని, కాపుల క్షేమం పూర్తిగా తనపైనే ఆధారపడుంటుందని ముద్రగడ చాలా బలంగా నమ్ముతుంటారు. అందులో ఎంత వరకూ నిజమనే విషయాన్ని పక్కనపెడితే, రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ బాగా హైలైట్ అయ్యారన్నది మాత్రం వాస్తవం. అందుకనే కాపులకు రిజర్వేషన్ అనగానే అందరికీ ముద్రగడే గుర్తుకువస్తున్నారు. మరి, ఈ స్ధాయిలో రిజర్వేషన్ల ఆందోళనలపై పేటెంట్ హక్కులు పొందిన ముద్రగడకు కాపు సామాజికవర్గంలో ఉన్న పట్టెంత ? అన్న విషయంపై అన్నీ చోట్లా చర్చించుకుంటున్నారు.
మధ్యలోనే కాడి దించేయటం అలవాటా ?
సామాజికవర్గంలోని నేతల సమాచారం ప్రకారం ఒకపుడు ముద్రగడ అంటే సామాజికవర్గంలో తిరుగులేని ఇమేజి ఉండేదట. కానీ కాలక్రమేణా ఆ ఇమేజి అంతా డ్యామేజి అయ్యింది. ఎందుకంటే, ఆయన వ్యవహార శైలే ప్రధాన కారణమని అంటుంటారు. అంశం ఏదైనా, ఏ ఉద్యమంలో అయినా తానొక్కడే హైలైట్ కావాలని అనుకుంటారనే ఆరోపణలున్నాయి ఆయనపైన. విషయం ఏదైనా కానీండి చివరి వరకూ పట్టుకోరట. మొదలుపెట్టేయటం మధ్యలోనే విడిచిపెట్టేయటం ముద్రగడకు బాగా అలవాటని కూడా ప్రచారంలో ఉంది.
కార్పొరేషన్ ఎన్నికల్లో కనబడని ప్రభావం
ఇక, సామాజికవర్గంపై పట్టు విషయం చూస్తే ఒకపుడుండే పట్టు ఇపుడు లేదన్నది సమాచారం. ఏదో ఆయన పిలుపివ్వటమే కానీ ముద్రగడ పిలుపును కాపులు పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదట. ఆ మధ్య జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలనే ఉదాహరణగా చూపుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ ముద్రగడ పిలుపిచ్చారు. అయినా కాపులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎలాగంటే, కార్పొరేషన్లోని మెజారిటీ డివిజన్లు టిడిపినే గెలుచుకున్నది. అంతకుముందు జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో కూడా కాపులు టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ ఇచ్చిన పిలుపును ఎవ్వరూ లెక్కచేయలేదు.
నిలకడలేమే ముద్రగడలో లోపమా ?
నిలకడలేని తనమే ముద్రగడకు పెద్ద మైనస్ గా చెబుతుంటారు. తాజా రిజర్వేషన్ల అంశమే తీసుకుంటే, మంత్రివర్గంలో, అసెంబ్లీలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయగానే ముద్రగడ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయటానికి, రిజర్వేషన్లు అమలవ్వటానికి ఆవకాయకు ఆవగింజకు ఉన్నంత తేడా ఉంది. తీర్మానం చేసినంత మాత్రాన రిజర్వేషన్ అమలైనట్లు కాదు. ఇక, తాజాగా రిజర్వేషన్లపై తన వైఖరి చెప్పగానే జగన్ పై ముద్రగడ మండిపడ్డారు. అదే సమయంలో చంద్రబాబుపై నమ్మకం ఉందని చెప్పారు. రిజర్వేషన్ల అంశాన్ని కంపు చేసిందే చంద్రబాబని అందరూ దుమ్మెత్తిపోస్తుంటే ముద్రగడ పొగడ్డమేంటో చాలామందికి అర్ధం కావటం లేదు. కాబట్టి జరుగుతున్న విషయాలను గమనిస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాపులపై ముద్రగడ ప్రభావం పెద్దగా ఉండదనే అనిపిస్తోంది.