విశాఖ జిల్లా రాజకీయాలలో ఓ ఇమేజ్ కలిగిన నాయకుడిగా ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీలోకి వచ్చేస్తున్నారు. చాలా తొందరలోనే ఆయన పసుపు చొక్కా తొడిగేస్తారని టాక్. ఈ మేరకు హరి తాజాగా అమారావతి వెళ్ళి మరీ టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసొచ్చారు. ఆయన చేరికపై బాబు పచ్చ జెండా ఊపేశారు. సో, ముహూర్తమే తరువాయి, హరి చేరిక ఇక లాంచనమే అవుతుంది.
వాళ్ళంతా గింజుకుంటున్నారట :
సబ్బం హరి కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వారు. ఆయన నాలుగు దశాబ్దల రాజకీయమంతా ఆ పార్టీతోనే ముడిపడి ఉంది. అలాంటి హరి మధ్యలో వైసీపీలో కొన్నాళ్ళు ఉన్నా 2019 ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని టీడీపీ కరెక్ట్ పార్టీ అని అడుగులేస్తున్నారు. ఆయన రాక పట్ల సీఎం చంద్రబాబు అమితాసక్తిని కనబరచడమే కాదు.ఎక్కడ సీటు కావాలన్న ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చేశారని టాక్. దాంతో మిగతా నాయకులు కిందా మీదా పడుతున్నారు. హరి ఎక్కడ తమ సీట్లకు ఎసరు పెడతాడోనని వాళ్ళంతా తెగ గింజుకుంటున్నారు.
అక్కడ నుంచేనా :
విశాఖ మేయర్ గా పని చేసిన హరి, అనకాపల్లి నుంచి 2009లో ఎంపీగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీ పవర్లోకి వస్తే మంత్రి కావాలనుంకుంటున్నారు. ఆయన చూపు తాను నివాసం ఉంటున్న విశాఖ ఉత్తరం మీదనే ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ పోటీ చాలా ఎక్కువగా ఉంది. దాంతో చాలా మంది పెద్ద తలకాయలే హరి ఎక్కడ ఈ సీటు తన్నుకుపోతారోనని హడలిపోతున్నారు.
అక్కడా కలవరమే :
ఇక విశాఖ రూరల్ జిల్లాలో మాడుగుల, అనకాపల్లి, విశాఖ ఎంపీ, భీమిలీ సీట్లు కూడా హరి సెలెక్ట్ చేసుకునే జాబితాలో ఉన్నాయట. దాంతో ఆక్కడ ఆశావహులంతా హరి ఎవరి నెత్తిన చేతులు పెడతారోనని కలవరపడుతున్నారు. దీంతో గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టేసి మరీ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు హరి పార్టీలో చేరిక విషయమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మొత్తానికి హరి రాక టీడీపీలో ఓ చిన్న తుపాన్ నే స్రుష్టిస్తోంది.