అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానని సీఎం చంద్రబాబునాయడు అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరులో ఆయన పర్యటించారు. పేరూరు ప్రాజెక్ట్ కు నీటిని తరలించే కాల్వకు చంద్రబాబు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...పేరూరు ప్రాజెక్ట్ కు నీటిని తరలించే కాల్వకు ‘పరిటాల రవీంద్ర కాల్వ’ గా పేరు పెడతామని చెప్పారు.
నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతపురం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం జరుగుతోందని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాయలసీమ కరువు తీర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని..అదృష్టం కొద్ది ఈసారి వర్షాలు కూడా విరివిగా పడ్డాయని..ఇక్కడ రైతు ఏ కష్టం పడకుండా చూసుకుంటానని అన్నారు.
ఒకప్పుడు సీమ అంటే కరువు ప్రాంతం అని ఎద్దేవా చేసేవారని..కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని..సిమ నేల కూడా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. అనంతపురం నుంచి కృష్ణపట్నం పోర్టును అనుసంధానం చేస్తూ జాతీయ రహదారిని నిర్మిస్తామని, అనంతపురం నుంచి అమరావతికి నాలుగు వరుసల రహదారిని కూడా నిర్మిస్తామని, ఈ జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చి తీరుతుందని అన్నారు. ప్రపంచంలోని ఐదు అగ్ర నగరాలలో ఒకటిగా అమరావతి నిర్మిస్తామని అన్నారు.