కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్ల కోసం జెఏసి కాపులనే తప్పుదోవ పట్టిస్తోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి కాపులను బిసిల్లో చేర్చటమనే డిమాండ్ ఇప్పటిది కాదు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ఎందుకు సాకారం కాలేదు ? అంటే సాంకేతికంగా అనేక సమస్యలున్నాయి కాబట్టే. వాస్తవాలను పట్టించుకోకుండా కాపు జెఏసి కూడా రిజర్వేషన్లపై ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారికే మద్దతు ఇవ్వాలంటూ తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన జెఏసి సమావేశం తీర్మానించింది. తీర్మానం వింటేనే ఆశ్చర్యంగా ఉంది.
కంపు చేసిందే చంద్రబాబు
పోయిన ఎన్నికల్లో కాపులను బిసి రిజర్వేషన్లలో కలిపేస్తానంటూ చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరి హామీని ఎందుకు నిలుపుకోలేకపోయారు ? ఎందుకంటే, తానిచ్చిన హామీ ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టే. సరే, తర్వాత జరిగిన ఆందోళనలు, మంజూనాధ కమిషన్ వేయటం, నివేదికపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపటం అందరికీ తెలిసిందే. రాష్ట్రప్రభుత్వం పంపిన తీర్మానం సరిగా లేదంటూ కేంద్రం ఆ తీర్మానాన్ని తిప్పి కూడా పంపేసింది.
50 శాతం దాటాలంటే పెద్ద తతంగమే ఉంది
ఏ రాష్ట్రంలో అయినా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్నది రాజ్యాంగ నిబంధనతో పాటు సుప్రింకోర్టు ఆదేశాలున్నాయి. ఎక్కడైనా రిజర్వేషన్ 50 శాతం దాటాలంటే రాజ్యాంగ సవరణలు అవసరం. అందుకు ప్రత్యేక అనుమతులు అవసరం. దానికి అనుసరించాల్సిన నిబంధనలు చాలా ఉన్నాయి. అంతిమంగా పార్లమెంటులో బిల్లు పాసైతేనే రాజ్యంగ సవరణ జరుగుతుంది. ఇంత తతంగం జరగాల్సుంటే చంద్రబాబు సింపుల్ గా అసెంబ్లీలో తీర్మానం చేసేసి కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేసినంత బిల్డప్ ఇస్తున్నారు.
ఎవరు హామీ ఇస్తున్నా మోసం చేస్తున్నట్లే
రాష్ట్రస్ధాయిలోని ఏ పార్టీ అధినేత అయినా లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ ఇస్తే అంతా ఉత్తిదే. ఆ రకంగానే చంద్రబాబు కాపులను మోసం చేశారు, ఇంకా చేస్తున్నారు. ఈ విషయంలో జగ్గంపేట బహిరంగ సభలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రిజర్వేషన్ల వర్తింపచేయటంలో సమస్యలు వివరించారు. చంద్రబాబు లాగ తాను తప్పుడు హమీలివ్వలేను అంటూ స్పష్టం చేశారు.
అన్నీ పార్టీలూ హామీలిస్తే ఏం చేస్తారు ?
ఇటువంటి పరిస్ధితుల్లో సమావేశమైన జెఏసి కాపుల రిజర్వేష్లపై స్పష్టమైన హమీ ఇచ్చిన వారికే మద్దతంటూ తీర్మానం చేయటంలో అర్ధమే లేదు. ఎందుకంటే, హమీలు ఇవ్వటంలో అందరికన్నా చంద్రబాబు ముందుంటారన్న విషయం తెలిసిందే. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీనే మళ్ళీ చంద్రబాబు ఇస్తే జెఏసి మద్దతిస్తుందా ? బిసిలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించానికి మద్దతిస్తున్నట్లు జగన్ కూడా ప్రకటించారు కదా ? కాపుల రిజర్వేషన్ పై తాము పూర్తి మద్దతిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. బహిరంగంగా ప్రకటన చేయకపోయినా బిజెపి కూడా అదే దిశలో ఆలోచిస్తోందని సమాచారం. అన్నీ పార్టీలు జెఏసి చెప్పినట్లు హమీలిస్తే మరి ఎవరికి కాపులు మద్దతివ్వాలి ?