తెలంగాణాలో టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జనసేనలో చేరుతున్నారా ? తెలుగురాష్ట్ర రాజకీయాల్లో ఇపుడిదే హట్ టాపిక్ గా మారింది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు చేసినందుకు మోత్కుపల్లిని పార్టీ నుండి బహిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి చంద్రబాబుపై మోత్కుపల్లి బహిరంగంగా యుద్దం ప్రకటించినట్లే అయ్యింది.
చంద్రబాబుపై కత్తి కట్టిన మోత్కుపల్లి
దానికి తగ్గట్లే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా తాను ఏపిలో పర్యటనలు చేస్తానంటూ మోత్కుపల్లి బహిరంగంగానే ప్రకటించారు. పర్యటనలు ఎప్పుడు మొదలవుతాయో తెలీదు కానీ మీడిమా సమావేశాల్లో మాత్రం చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మోత్కుపల్లి భేటీ అవుతున్నారు. ఈ విషయం రాజకీయవర్గాల్లో బాగా ఆసక్తిని రేపుతోంది. తెలంగాణాలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోత్కుపల్లి పవన్ తో భేటీ అవుతుందటమే ఆసక్తికి కారణమైంది.
జనసేనకు మోత్కుపల్లే దిక్కా ?
మోత్కుపల్లి ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. అదే సమయంలో వచ్చే సాధారణ ఎన్నికలు ముంచుకువచ్చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏదో ఒక పార్టీలో మోత్కుపల్లి చేరక తప్పదు. టిఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతున్నా అదేమైంతో ఎవరికీ తెలీదు. ఇంతలో పవన్ తో భేటీ అవుతుండటం గమనార్హం. మోత్కుపల్లి త్వరలో జనసేనలో చేరుతారంటూ ప్రచారం మొదలైంది. మోత్కుపల్లికి పార్టీ లేదు. జనసేన పార్టీకి నేతల అవసరం చాలా ఉంది. కాబట్టి మోత్కుపల్లిని జనసేనలోకి చేర్చుకుని తెలంగాణా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీరి భేటీ తర్వాత కానీ స్పష్టమైన వివరాలు వచ్చే అవకాశాలు లేవు.