హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప పెద్ద జోక్ వేశారు. కాపులను బిసిల్లోకి చేర్చుతూ అసెంబ్లీ తీర్మానాన్ని, ప్రభుత్వం పంపిన ఫైలును కేంద్రప్రభుత్వం తొక్కిపెట్టిందంటూ మండిపడ్డారు. ఇక్కడే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఒకవైపేమో రాష్ట్రప్రభుత్వం నుండి వెళ్ళిన కాపుల రిజర్వేషన్ ఫైలును కేంద్రం ఎప్పుడో తిప్పి పంపేసిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం పంపిన ఫైలులో సరైన వివరాలు లేవంటూ కేంద్రం తిప్పికొట్టిందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. మరి నిమ్మకాయలేమో తాజాగా తొక్కిపెట్టిందంటూ ఆరోపిస్తున్నారు. రెండింటిలో ఏది నిజమో జనాలకు అర్ధం కావటం లేదు.
కేంద్రం ఎందుకు రెజెక్ట్ చేసింది ?
కాపుల రిజర్వేషన్ ఫైలును కేంద్రం ఎందుకు రెజెక్ట్ చేసింది ? అంటే చంద్రబాబునాయుడు పంపిన ఫైలులో పూర్తి సమాచారం లేదట. కాపులకు రిజర్వేషన్ వర్తింపచేయాలనే డిమాండ్ కు మద్దతుగా సామాజిక సర్వే లాంటి వివరాలు లేవట. పైగా కమీషన్ ఛైర్మన్ మంజూనాధ సంతకంతో తయారైన నివేదికనే పంపలేదట. దాంతో ప్రతిపాదనలో పస లేదంటూ కేంద్రం తిప్పిపంపేసిందని అంటున్నారు.
పవన్ అసలు నోరే విప్పలేదు
తాజాగా హోంమంత్రి మాట్లాడుతూ, రిజర్వేషన్లపై మంత్రుల బృందం చర్చలు జరుపుతుందన్నారు. కేంద్రానికి పంపిన ప్రతిపాదనే సరిగా లేదని అంటూంటే చంద్రబాబేమో రిజర్వేషన్లపై చిత్తశుద్దితో ఉన్నట్లు నిమ్మకాయల సర్టిఫికేట్ ఇచ్చేశారు. స్పష్టంగా ప్రకటించినా రిజర్వేషన్ల అంశంపై జగన్ యు టర్న్ తీసుకున్నారట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే అసలు రిజర్వేషన్ల అంశాన్నే మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. తమ చిత్తశుద్దిని చూసే కాపు ఉద్యమనేత ముద్రగడ టిడిపికి మద్దతు ఇస్తున్నట్లు నిమ్మకాయల చిన్నరాజప్ప చెప్పటం గమనార్హం.