భక్తులు ఎంతగానో కొలిచే దైవం యాదాద్రి నరసింహ స్వామి. కానీ ఇప్పుడు అక్కడ కొంత మంది దుర్మార్గులు చేస్తున్న పనికి పుణ్యక్షేత్రానికి మచ్చ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అంతే కాదు కామాంధులు చేతిలో చిన్న పిల్లలు సైతం బలి అవుతున్నారు. తాజాగా యాదగిరిగుట్ట వ్యభిచారం జరుగుతుందని ఇప్పటికే పలు మార్లు పోలీసులు రైడ్ చేశారు..చేస్తూనే ఉన్నారు. పోలీసు తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో నలుగురు బాలికలు పట్టుబడ్డారు. ట్విస్ట్ ఏంటంటే..ఇదే ఇంటిలో రెండు రోజుల క్రితం కూడా తనిఖీలు చేసిన సమయంలో, వారెవరూ పట్టుబడలేదు.
కానీ, ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో మరోసారి దాడికి వెళ్లిన పోలీసులు, గదిలోని మంచం కింద గోడను తొలుస్తూ మూడు అడుగుల వెడల్పుతో ఉన్న సొరంగంలో బాలికలను దాచారని గుర్తించి విస్తుపోయారు. అయితే వ్యభిచార నిర్వాహకులు పోలీసులు రైడ్ చేస్తున్నాన్న సమాచారం తెలుసుకొని చాలా మంది పిల్లలను ఆ సొరంగంలోకి పంపిస్తారని, అందులో ఆరుగురు పట్టే వీలుందని, బయటకు ఎంతమాత్రమూ అనుమానం రాని విధంగా దాన్ని నిర్మించి, మంచాన్ని అడ్డు పెట్టారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
అయితే పట్టణంలోని పాత నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే దారిలోని మరిన్ని ఇళ్లలో ఇదే తరహా నిర్మాణాలు ఉండవచ్చన్న పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు మరింత విస్తృతంగా తనిఖీలు చేస్తామని చెప్పారు.