వినటానికి ఆశ్చర్యంగానే ఉంది. జనసేన పెట్టి ఇంతకాలమైనా వివిధ రంగాల్లోని ప్రముఖులే కాదు ఇతర సామాజికవర్గాలకు చెందిన ప్రముఖులు కూడా ఇంత వరకూ జనసేన వైపు కనీసం చూడలేదు. నిజానికి పవన్ కల్యాణ్ పార్టీని పెట్టి ఐదేళ్ళయినా పవనే పార్టీ నిర్మాణాన్ని పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఇంత వరకూ ఎవరు అటువైపు చూడలేదని అనుకోవచ్చు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కూడా ఎవరూ ఎందుకు జనసేనలో చేరటానికి మొగ్గు చూపటం లేదు ? ఎందుకంటే పవన్లోనే లోపం ఉందని సమాధానం వినిపిస్తోంది.
పిఆర్పీని గుర్తుకు తెచ్చుకుంటున్నారా ?
ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. అన్న, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంపార్టీని పెట్టినపుడు వివిధ సామాజికవర్గాలకు చెందిన ప్రముఖులు పిఆర్పిలో చేరారు. ముఖ్యంగా మైనారిటీలు, బిసి వర్గాలతో పాటు రెడ్లు తదితర సామాజికవర్గాలు కూడా చేరారు. కాకపోతే అందరూ కలిసి దెబ్బతిన్నారన్నది వేరే సంగతి. మొత్తం 294 నియోజకవర్గాల్లో పిఆర్పీ పోటీ చేస్తే గెలిచింది 16 మంది ఎంఎల్ఏలు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.
పిఆర్పీ-జనసేనకు పోలిక
మళ్ళీ ప్రస్తుతానికి వస్తే అందరూ ఇప్పటి జనసేనను అప్పటి పిఆర్పీతో పోల్చు చూస్తున్నారు. ఎందుకంటే, చిరంజీవి పార్టీ పెట్టినపుడు అన్నీ సామాజకవర్గాలకు చెందిన నేతలూ చేరినపుడు జనసేనలో మాత్రం ఎందుకు చేరటం లేదు ? ఇప్పుడు జనసేన లాగ అప్పటి పిఆర్పీ విషయంలో కూడా కాపులదే డామినేషన్ అయ్యింది. మైనారిటీలు, బిసి తదితర సామాజికవర్గాల వారున్నా పిఆర్పి పెట్టిందే కాపుల కోసమనే ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది. ఇపుడు జనసేన విషయంలో కూడా అదే జరుగుతోంది. కాకపోతే పిఆర్పీలో ఉన్నట్లుగా జనసేనలో ఇతర సామాజికవర్గాల నేతలు ఎక్కడా కనబడటం లేదు.
పవన్ ఆహ్వానించినా చేరని దాడి
పోనీ కాపుల్లోని ప్రముఖులెవరైనా ఉన్నారా అంటే అది కూడా కనబడటం లేదు. రాష్ట్రం మొత్తం మీద కాపు సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కూడా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతే అయినా కూడా ప్రముఖులెవరూ జనసేనలో చేరలేదు. ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ అదే పనిగా మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావును జనసేన పార్టీలో చేరాల్సిందిగా బహిరంగంగా ఆహ్వానించారు. అంత వరకూ ఎవరిని కూడా పార్టీలో చేరమని పవన్ బహిరంగంగా ఆహ్వానించ లేదు. అయినా సరే జనసేనలో చేరటానికి దాడి ఇష్టపడలేదు.
ఎవరిలోనూ నమ్మకం కుదరటం లేదా ?
జనసేన వైపు ప్రముఖ నేతలు మొగ్గు చూపకపోవటానికి ప్రధాన కారణం పవన్ వ్యవహార శైలే అని ప్రచారం జరుగుతోంది. స్ధిరత్వం లేని నేతగానే పవన్ అందరూ చూస్తున్నారు. రెండు రోజులు జనాల్లో తిరిగితే మళ్ళీ పది రోజులు ఎవరికీ కనబడరు. ఏ విషయంలోనూ స్ధిరభిప్రాయం వ్యక్తం చేయలేరు. అన్నీ స్ధానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ పదే పదే ప్రకటిస్తున్నా జనాలు ఎవరూ నమ్మటం లేదు. పైగా పవన్ అంటే ఇంకా చంద్రబాబు జేబులోని మనిషే అన్న ముద్ర తొలగలేదు. బహుశా అందుకేనేమో ప్రముఖ నేతలెవరూ జనసేన వైపు చూడటం లేదు. ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో అన్నీస్ధానాల్లో పోటీ చేయటం, పాతికేళ్ళ రాజకీయం చేయటానికి సిద్దపడటం పవన్ కు సాధ్యమేనా ?