చంద్రబాబు నాయుడును భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోము వీర్రాజు వదిలేట్లుగా లేరు. ఇటీవల కొంతకాలం కామ్ గ ఉన్నప్పటికీ మళ్ళీ ఈరోజు రెచ్చిపోయారు. వీర్రాజు అనేక ఆరోపణలు చేసిన తర్వాత చంద్రబాబును బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్ నే డిమాండ్ చేయటం గమనార్హం. పైగా రాష్ట్రంలో ఇంత అవినీతి పాలన జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ గవర్నర్ నే నిలదీయటం ఆశ్చర్యంగా ఉంది.
నీరు-చెట్టులో భారీ అవినీతి
ఇంతకీ విషయం ఏమిటంటే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన వీర్రాజు ముఖ్యమంత్రిపై ఆరోపణలతో రెచ్చిపోయారు. నీరు-చెట్టు కార్యక్రమంలో మట్టి తవ్వి తీయటానికి రూ. 13, 600 కోట్లు ఖర్చు చేశారా అంటూ మండిపడ్డారు. ఓ పథకంలో ఎక్కడైనా రూ. 13 వేల కోట్లు ఖర్చుపెడాతారా అంటూ ఆశ్చర్యపోయారు. పైగా తవ్వితీసిన మట్టిని కూడా టిడిపి నేతలు అమ్మేసుకున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబును పంచభూతాలు గమనిస్తున్నాయ్..జాగ్రత్త అంటూ హెచ్చరించారు. చంద్రబాబును పంచభూతాలు ఏం చేస్తాయో మాత్రం రాజు గారు చెప్పలేదు.
నామినేషన్ పై రూ. 250 కోట్ల టెండర్
అలాగే, పాఠశాలలకు సున్నాలు వేయటంలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. సున్నాలు వేయటానికి రూ. 3.5 కోట్లు సరిపోతే ప్రభుత్వం మాత్రం ఏకంగా రూ 125 కోట్లు ఖర్చు అయినట్లు చెప్పటంలోనే ఏ స్ధాయి అవినీతి జరిగిందో తెలిసిపోతోందన్నారు. అంతేకాకుండా స్కూలు యూనిఫారంల టెండర్ కూడా తనకు కావాల్సిన నేతకు చంద్రబాబు రూ. 250 కోట్ల నామినేషన్ పై కట్టబెట్టాశారంటూ మండిపోయారు. ఇంత అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిజంగానే అంత స్ధాయిలో అవినీతి జరుగుతుంటే ఆధారాలను కేంద్రప్రభుత్వానికి ఇచ్చి విచారణ చేయించవచ్చు కదా ?