తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ స్పందించారు. ప్రస్తుతం కరుణానిధి కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్టాలిన్ స్పష్టంచేశారు. కాగా, డీఎంకే చీఫ్ కరుణానిధి అస్వస్థతకు గురికావడంపై కలత చెంది గత ఐదురోజుల్లో మొత్తం 21 మంది కార్యకర్తలు మృతి చెందినట్టు ఆపార్టీ వెల్లడించింది.
ఆవేదనతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభ్యర్థించారు. అయితే పార్టీ అధ్యక్షుడు కలైజ్ఞర్ అస్వస్థతకు గురికావడం పట్ల షాక్కు గురై 21 మంది కార్యకర్తలు చనిపోయారని తెలిసి నేను తల్లడిల్లిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్టు వైద్యులు చెప్పినట్టు స్టాలిన్ వెల్లడించారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వెలువడిన అనంతరం డీఎంకే పార్టీ కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారిని శాంతియుతంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ స్టాలిన్ ఈ ప్రకటన చేశారు.