వైసిపి పిచ్చిగానీ ఫిరాయింపు ఎంపిలపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా ? లేవుగాక లేవు. తాజాగా రాజ్యసభలో సమావేశాల్లో ఫిరాయింపు ఎంపిలపై చర్యలు తీసుకోవాలంటూ వైసిపి సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభ ఉపాధ్యక్షుడిని అడిగారు లేండి. అందుకనే మళ్ళీ ఆ విషయం ప్రస్తావనకు వచ్చింది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన నలుగురు ఎంపిలు పార్టీలు ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణాలో ఖమ్మం ఎంపి శ్రీనివాసులరెడ్డి టిఆర్ఎస్ లో చేరితే ఏపిలో ముగ్గురు ఎంపిలు బుట్టారేణుక, కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి టిడిపిలోకి ఫిరాయించారు. పై నలుగురు పార్టీలు ఫిరాయించి సుమారు నాలుగు సంవత్సరాలవుతున్నా ఇంత వరకూ ఎవరిపైనా చర్యలు లేవు. అటువంటిది ఎన్నికల ముందు వారిపై ఎవరు చర్యలు తీసుకుంటారు ?
ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు
ఎంపిలు ఫిరాయించిన తర్వాత నుండి ఇప్పటి వరకూ ఎన్నోసార్లు వైసిపి స్పీకర్ సుమిత్రా మహజన్ కు చాలా ఫిర్యాదులే చేసింది. స్పీకర్ వైపు నుండి కనీసం మొహమాటానికి కూడా ఎటువంటి స్పందనా కనబడలేదు. సరే, ఇంతకాలమంటే ఏదోలే వదిలేశారని సర్దిచెప్పుకోవచ్చు. కానీ మొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో ఎంపి బుట్టా రేణుక ఏ పార్టీ ఎంపిగా మాట్లాడారు ?
బుట్టా ఏ పార్టీ ఎంపిగా మాట్లాడారు ?
ఎందుకంటే, అప్పటికే వైసిపికి చెందిన ఐదుమంది ఎంపిలు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు ఆమోదం కూడా పొందాయి. మిగిలిన నలుగురు ఎంపిలపై తక్షణమే అనర్హత వేటు వేయాలి మళ్ళీ వైసిపి కోరింది. వారిపై ఎటువంటి చర్యలు లేకపోగా ఫిరాయించిన నలుగురు ఎంపిల్లో ఒకరైన బుట్టాతో తెలుగుదేశంపార్టీ సభ్యురాలిగా మాట్లాడే అవకాశం స్పీకర్ కల్పించటం దారుణం. ప్రధానమంత్రి సమక్షంలోనే జాతీయ పార్టీల నేతల ముందే సభలో స్పీకర్ ఆ విధంగా వ్యవహరిస్తే ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లేనా ?
మోడి ఆదేశాలతోనే జరుగుతోంది
ఇక్కడ ఒక విషయంలో క్లారిటీ వచ్చేసింది. స్పీకర్ ఏం చేసినా ప్రధానమంత్రి ఆదేశాలు లేకుండా చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేయటం వృధానే. కాకపోతే వైసిపి చేయాల్సిందొకటుంది. వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపు ఎంపిలు ఏ పార్టీల తరపున పోటీలోకి దిగుతారో తెలీదు. పోటీకి దిగినపుడు వారిపై గట్టి అభ్యర్ధులను రంగంలోకి దింపి వారిని ఓడగొట్టేందుకు ప్రయత్నించటమే చేయగలిగింది.
వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఫిరాయింపులు
ఎటుతిరిగీ ఫిరాయింపులపై జనాల్లోనే కాకుండా టిడిపిలో కూడా విపరీతమైన వ్యతిరేకత ఉందన్న మాట వాస్తవం. దాన్ని వైసిపి అవకాశంగా తీసుకునే మార్గాలేంటో చూడాల్సిందే. ఫిరాయింపుల్లో బుట్టా రేణుక, కొత్తపల్లి గీతల పరిస్ధితేంటో అందరికీ ఈపాటికే అర్ధమైంది. ఒక్క వైసిపి రెడ్డే అనారోగ్యం కారణంగా ఎక్కువగా బయట తిరగటం లేదు కాబట్టి జనాల్లో ఆయనపై ఎటువంటి అభిప్రాయముందో స్పష్టత లేదు.