వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందకు పలువురు రిటైర్డు ఉన్నతాధికారులు, ఎన్ఆర్ ఐలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా వైసీపీ టికెట్లు ఆశిస్తున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదే సమయంలో అధికార టీడీపీ నుంచి కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అంచనావేస్తూ.. రాజకీయ భవిష్యత్ కోసం దీంతో ఇప్పటికే ఉన్న నేతలకు వారి నుంచి పోటీ తప్పదని పలువురు నాయకులు అంటున్నారు. ఆయా పార్టీల అధినేతలు ఎవరివైపు మొగ్గచూపుతారన్నదానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అమలాపురం పార్లమెంటు స్థానంతోపాటు అసెంబ్లీ టికెట్ను రిటైర్డు ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు.
2014 ఎన్నికలలో ఐఆర్ఎస్ అధికారి పండుల రవీంద్రబాబు ఉద్యోగానికి రాజీనామా చేసి అమలాపురం లోక్సభ నుంచి టీడీపీ టికెట్పై పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. ఇక అమలాపురం అసెంబ్లీ నుంచి జెడ్పీ మాజీ సీఈవో గొల్ల బాబూరావు, రాజోలు అసెంబ్లీ నుంచి మరో ప్రభుత్వ ఉద్యోగి బొంతు రాజేశ్వరరావు వైసీపీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున అమలాపురం లోక్సభ టికెట్ కోసం రిటైర్డ్ ఐపీఎస్ సుందర కుమార్ దాస్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐఆర్ఎస్ అధికారి కూడా ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో రాజోలు వైసీపీ టికెట్ మళ్లీ తనకేనంటూ బొంతు రాజేశ్వరరావు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు.
అలాగే.. కాకినాడ రూరల్లో టీడీపీ టికెట్ కోసం శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఇదే వరుసలో మరో ఇద్దరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గన్నవరం అసెంబ్లీ సీటు కోసం రిటైర్డ్ ఇంజనీర్ వేణుగోపాలరావు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లోనూ ఆయన ప్రయత్నాలు చేశారు. రంపచోడవరం అసెంబ్లీ నుంచి టీడీపీ తరపున జెడ్పీ మాజీ సీఈవో ఒకరు పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే ఈయనపై పలు ఆరోపణలు ఉండడంతో టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చేది డౌటేనని పలువురు నాయకులు అంటున్నారు. జనసేన టికెట్ కోసం పిఠాపురం నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ అధికారి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.