కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది కాబట్టి తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ నేతలు ముద్రగడకు ఆఫర్ ఇచ్చారు. కృష్ణా, గుంటూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు కిర్లంపూడికి వెళ్ళి ముద్రగడను కలిసారు లేండి. ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి ఆదేశాల మేరకే తాము మాట్లాడేందుకు వచ్చినట్లు కూడా కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు.
జవసత్వాల కోసం ప్రయత్నాలు
కాంగ్రెస్ పార్టీ వరస చూస్తుంటే ప్రజల్లోని భావోద్వేగాలను అనుకూలంగా మలుచుకోవాలని పెద్ద ప్లాన్ లో ఉన్నట్లు కనబడుతోంది. మెజారిటీ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన విషయం అందరికీ తెలిసిందే. దాని ఫలితంగానే పోయిన ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. సరే, వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీ కోలుకుంటుందా అన్నది వేరే సంగతి. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్దితులను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ జవసత్వాలు కూడదీసుకోవాలని ప్రయత్నిస్తోందన్నది వాస్తవం.
నాలుగు సీట్లు గెలవటమే లక్ష్యమా ?
అందులో భాగంగానే రాహూల్ ప్రధనమంత్రి కాగానే ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఇటీవలే పార్టీలో అత్యున్నత నిర్ణాయక వేదికైన సిడబ్ల్యూసి నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే పద్దతిలో ఇపుడు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. అంటే ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యమైనవా కాదా అన్నది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసినట్లుంది. వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా నాలుగు సీట్లు గెలవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకనే పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నోటికొచ్చిన హామీలిచ్చేసినట్లు ఇపుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది. మరి, కాంగ్రెస్ ఆఫరర్ కు ముద్రగడ ఏ విదంగా స్పందిస్తారో చూడాల్సిందే.