వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యంగా గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గంలో తమ్ముళ్ళ మధ్య కుమ్ములాటలు తారస్దాయికి చేరుకున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎంఎల్ఏ ఉండగానే టిక్కెట్టు కోసం తమ్ముళ్ళు పోటీ పడుతుండటం విచిత్రంగ ఉంది. సిట్టింగ్ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాల రెడ్డి వ్యవహారం అటు ఇటుగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో పోటీ విషయమై తెలుగుదేశంపార్టీలో పోటీ తీవ్రంగా పెరిగిపోయింది.
అయోమయంలో మోదుగుల పోటీ
ఇంతకీ విషయం ఏమిటంటే, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోటి చేయటానికి టిడిపిలోని ముగ్గురు బలమైన నేతల వారసలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ మోదుగుల ఈ నియోజకవర్గంలో పోటీ చేసే విషయమై సస్పెన్స్ లో పడింది. నరసరావుపేట ఎంపిగా పోటీ చేస్తారనే ప్రచారంతో పాటు అసలు పార్టీకే గుడ్ బై చెప్పేస్తున్నారనే ప్రచారం కూడా బాగా వినబడుతోంది. వచ్చే ఎన్నికల్లో మోదుగుల వైసిపి నుండి పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే.
పోటీలో ముగ్గురు వారసులు
సో, మోదుగుల వ్యవహారం సందిగ్దంలో పడటంతో టిడిపి నేతలైన స్పీకర్ కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరామ్, నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు కొడుకు రంగబాబు, పెదకూరపాడు ఎంఎల్ఏ కొమ్మాలపాటి శ్రీధర్ కుమారుడు సుధాకర్ ఈ సీటుపై కన్నేశారు. విషయం ఏమిటంటే తన భవిష్యత్తుపై మోదుగుల మాత్రం ఇంత వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినా ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేసేసుకుంటున్నారు.
ఎంఎల్ఏపై మండుతున్న కమ్మోరు
ఎంఎల్ఏ వ్యవహార శైలి వల్ల జిల్లాలోని కమ్మ సామాజికవర్గం నేతల్లో చాలామంది మోదుగులపై మండిపోతున్నారు. అదే సమయంలో నియోజకవర్గం సిటీలో ఉండటంతో జిల్లాలోని ఎక్కడెక్కడి ఎంఎల్ఏలు ఈ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారు. దాంతో ఇతర నేతల జోక్యంపై ఎంఎల్ఏ కూడా మండతున్నారు. నియోజకవర్గం ఓట్లలో కాపులు 25 వేలున్నారు. రెడ్లు 13 వేలు, ఎస్సీ, బిసి, మైనారిటీ ఓట్లు దాదాపు లక్షన్నర ఉన్నాయి. మరి ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పోటీ ఏ స్ధాయికి చేరుకుంటుందో చూడాల్సిందే.