ప్రధానమంత్రి నరేంద్రమోడితో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు భేటీ అయ్యారు. హై కోర్టు విభజన, తెలంగాణాలో కొత్త జోన్ల ఏర్పాటుపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. గడచిన రెండు రోజులుగా కెసిఆర్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి అందరికీ తెలిసిందే. హై కోర్టు విభజనపై తెలంగాణా వాదులు ముఖ్యంగా టిఆర్ఎస్ నేతలు ఎప్పటి నుండో పట్టుబడుతున్న విషయం కొత్తేమీ కాదు. పనిలో పనిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, విభజన హామీల అమలు జరగాలంటూ ప్రధానిని కెసిఆర్ కోరారు. భేటీలో దాదాపు పది అంశాలను కెసిర్ ప్రస్తావించారు.
సచివాలయానికి స్ధలం కావాలి
వివిధ పథకాలకు కేంద్రం అందిస్తున్న నిధుల మొత్తాన్ని పెంచాలని కూడా కోరారు. తెలంగాణాలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, సచివాలయం నిర్మాణానికి సంబంధించి అవసరమైన స్ధలాన్ని రక్షణ శాఖ నుండి అందించాలని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులను వెంటనే అందించాలని కూడా కెసిఆర్ కోరారు. తెలంగాణా అభివృద్ధికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఐటిఐఆర్, ఐఐఎంను కూడా మంజూరు చేయాలని కెసిఆర్ కోరారు. కరీంనగర్ లో ఐఐఐటి ఏర్పాటు అంశం ఎప్పటి నుండో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ప్రతీ జిల్లాలోనూ జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
జోనల్ వ్యవస్ధను ఆమోదించండి
తెలంగాణా అభివృద్ధికి సిద్దం చేసిన ఒక నోట్ ను కెసిఆర్ ప్రధానికి అందచేశారు. అంతుకు ముందే కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కూడా కెసిఆర్ ను కలసిన సంగతి అందరికీ తెలిసిందే. సరే నోట్ లో ఎన్ని అంశాలున్నా కెసిర్ ప్రధానంగా ప్రస్తావించింది మాత్రం హై కోర్టు విభజన, జోనల్ వ్యవస్ధకు ఆమోదం గురించే . ఎందుకంటే, 10 జిల్లాల తెలంగాణాను 31 జిల్లాలుగా మార్చిన తర్వాత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై జోనల్ సమస్య తెలెత్తింది. ఆ సమస్యను పరిష్కరించకపోతే జిల్లాలను పెంచి కూడా ఉపయోగం ఉండదు. అదే సమయంలో అనేక చిక్కులు కూడా మొదలయ్యాయి. అందులోనూ ఎన్నికలు ఎంతో కాలంలో లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకునే కెసిఆర్ జోనల్ సమస్య పరిష్కారానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు.