చంద్ర బాబు నాయుడు తాను ఏం మాట్లాడిన ప్రజలు వింటారులే వీరంతా అమాయకులు వీరికేమి తెలియదు అనే రీతిలో బాబు మాట్లాడుతున్నాడు. నాలుగేళ్లు పాటు బీజేపీ తో కలిసి సంసారం చేసి ఇప్పుడేమో ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ప్లేట్ మార్చి తప్పులన్నీ బీజేపీ మీదకు మళ్ళిస్తున్నారు. కానీ ప్రజలు అంత అమాయకులు కాదు కదా..! రాష్ర్టం అభివృద్ధి చెందకపోవడానికి మోడీనే కారణమని నెపాన్ని కేంద్రంపై నెట్టేసి తాను తప్పించుకుందామని చంద్రబాబు అనుకోవచ్చు గాని, ప్రజలు మాత్రం వదిలి పెట్టరనే సంగతిని గుర్తించుకోవాలి.
ప్రత్యేకహోదా కాదనుకుని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడమే గాకుండా హోదా మాట ఎత్తితే జైల్లో వేస్తానని చంద్రబాబు హెచ్చరించిన మాట వాస్తవమా? కాదా?. ఇంతకంటే ఏ రాష్ర్టానికైనా ఎక్కువ నిధులిచ్చారా? ఇచ్చి ఉంటే చెప్పండి అని సీఎం సహా కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ర్టమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీ నేతలకు సవాల్ విసరలేదా? అంతేకాదు రాష్ర్టాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీకి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపలేదా? జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రమే కట్టి ఇవ్వాల్సి ఉండగా, కేవలం కాంట్రాక్టులు, కమీషన్ల కోసం మీరు అడిగి తీసుకోలేదా... మరిప్పుడు మోడీపై ఏడిస్తే ఏంలాభం.
ఏపీ విషయంలో కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్యం, కుట్రలో మోడీతో మీది కూడా సమాన భాగస్వామ్యం ఉంది. ఇది మీరు కాదన్నంత మాత్రాన కాకుండా పోదు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీకి అన్యాయం చేసిన మోడీతో మీ ప్రత్యర్థులు జగన్, పవన్ అంటకాగుతున్నారనే ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోడాన్ని ఎవరూ తప్పపట్టరు. రాజకీయాల్లో ఎవరి పంథా వారిదే. కాని అంతిమంగా ప్రజలే న్యాయనిర్ణేతలు. ఈ నాలుగేళ్లలో మోడీతో కలిసి మీరు ఏమేమి చేశారో ప్రజలకు బాగాతెలుసు.