ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబునాయుడు తాయిలాలను పంచుతున్నారు. సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్న కార్పొరేషన్లలో ఆరింటికి చంద్రబాబు తాజాగా ఛైర్మన్లను నియమించారు. దాదాపు నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉంచి ఇపుడు హటాత్తుగా వాటిల్లో కొన్నింటిని భర్తీ చేస్తున్నారంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్న విషయం స్పష్టమైపోతోంది. అయితే, జరగిన భర్తీలో ఓ ఫిరాయింపు మంత్రికి చంద్రబాబు షాక్ ఇచ్చారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఏవికి పదవి ఇవ్వటంలో అర్ధమేంటి ?
నియమించిన ఆరు కార్పొరేషన్లలో రెండు రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లాకు రెండు ఛైర్మన్ పదవులను, కర్నూలు జిల్లాకు రెండు ఛైర్మన్ పదవులను కట్టబెట్టిన చంద్రబాబు విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల నేతలకు చెరోకటి కట్టబెట్టారు. ఇందులో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ, నంద్యాలలో ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ పై కత్తి కట్టిన తిరుగుబాటు నేత ఏవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. ఏవికి ఏపి సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. మంత్రితో సమానంగా క్యాబినెట్ గుర్తింపు కలిగిన పెద్ద కార్పొరేషన్ పై ఏవి కన్నేశారు. అయితే, చంద్రబాబు మాత్రం ఏపి సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తో సరిపెట్టారు. కాబట్టి ఏవి ప్రతిస్పందన ఏంటన్నది ఇంకా తెలీలేదు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకునే ?
ప్రత్యేకించి ఏవికి కార్పొరేషన్ ఛైర్మన్ కట్టబెట్టటంలో చంద్రబాబు ఉద్దేశ్యం ఏంటో అర్ధం కావటం లేదు. ఎన్నికలకు ముందు ఏవికి పదవి రావటం భూమా అఖిలప్రియకు ఏమాత్రం ఇష్టం లేదు. వచ్చిన పదవిని అడ్డుపెట్టుకుని రేపటి ఎన్నికల్లో పై రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట టిక్కెట్టు అడగటం ఖాయం. ఇప్పటికే ఆ విషయాన్ని ఏవి స్పష్టంగా ప్రకటించారు కూడా. కార్పొరేషన్ ఛైర్మన్ ఇచ్చాం కాబట్టి అసెంబ్లీ టిక్కెట్టుకు పోటీ పడద్దని చెబితే వినేరకం కాదు ఏవి.
దాంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఏవిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా ? లేకపోతే భూమాకు షాకిచ్చే ఉద్దేశ్యంతోనే ఏవికి పదవిని కట్టబెట్టారా అన్నదే ఎవరికీ అర్దం కావటం లేదు.