కర్నూలు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయ్. అజ్ఞానంతో చిన్నబాబు నారా లోకేష్ పెట్టిన చిచ్చు అంతకంతకు రాజుకుంటూనే ఉంది. తాజాగా టిజి వెంకటేష్ కొడుకు టిజి భరత్ చేసిన ప్రకటన రాబోయే ఉపధ్రవానికి నిదర్శనంగా కనిపిస్తోంది. భరత్ చేసిన ప్రకటనతో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయటానికి నిర్ణయించుకున్నట్లే కనబడుతోంది. భరత్ ఎప్పుడైతే ప్రకటించారో వెంటనే జిల్లాలో రాజీకాయాలు హాట్ హాటుగా మారిపోయాయి.
చంద్రబాబు అయితే అభ్యంతరం లేదట
ఇంతకీ టిజి భరత్ ఏమన్నారంటే, వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు పోటీ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు కాకుండా ఇంకెవరైనా పోటీ చేస్తున్నారంటే తాము అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మూడో వ్యక్తి ఎవరు పోటీలో ఉన్నా కచ్చితంగా తాము ఒప్పుకునేది లేదని కాబట్టి పోటీలో తానూ ఉంటానంటూ స్పష్టంగా ప్రకటించారు. దాంతో భరత్ ప్రకటనలో ఎన్నో అర్ధాలున్నాయంటూ టిడిపి సీనియర్ నేతలంటున్నారు.
లోకేష్ అధికారాలనే ప్రశ్నించిన టిజి
ఆమధ్య జిల్లా పర్యటనకు వచ్చిన లోకేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డే పోటీ చేస్తారంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఎందుకంటే, ఎస్వీ మోహన్ రెడ్డి ఫిరాయింపు ఎంఎల్ఏ. అందులోనూ బాగా బ్యాడ్ నేమ్ ఉందని ప్రచారంలో ఉంది. దాంతో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ఎంఎల్ఏ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో లోకేష్ చేసిన ప్రకటనతో టిజి వెంకటేష్ మండిపడిన సంగతి అందరూ చూసిందే. ఎస్వీ పోటీ చేస్తారంటూ ప్రకటించటానికి అసలు లోకేష్ కున్న అధికారాలేంటని వెంకటేష్ ప్రశ్నించటం పార్టీలో సంచలనంగా మారింది.
ఇండిపెండెంట్ గా పోటీ ఖాయమేనా ?
ఈ నేపధ్యంలోనే కర్నూలులో ఆదివారం భరత్ ఓ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అంటూ ప్రకటించారు. పార్టీతో సంబంధం లేకుండా తమకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయటం సర్వత్రా చర్చగా మారింది. భరత్ నిర్వహించిన సమావేశానికి టిడిపి నేతలతో పాటు నగరంలో ఉన్న కొందరు ప్రముఖులు కూడా పాల్గొనటంతో రాజకీయం వేడెక్కింది. టిడిపి టిక్కెట్టు రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీలో ఉండేది ఖాయమని భరత్ మాటలను బట్టి తెలుస్తోంది. అంటే ఒకవిధంగా టిజి కుటుంబం టిడిపిపై తిరుగుబాటుకు సిద్దమైనట్లే కనిపిస్తోంది. మరి ఈ సమస్యను చంద్రబాబు ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.
ఐదు నియోజవకర్గాల్లో గొడవలే
ఒకవైపు కర్నూలు కేంద్రంలో పరిస్ధితి ఈ విధంగా ఉంటే ఆళ్ళగడ్డ, నంద్యాల, బనగానపల్లి నియోజకవర్గాల్లో కూడా పరిస్ధితులు టిడిపి చేతులు దాటిపోతోంది. బనగానపల్లి ఎంఎల్ఏ బిసి జనార్దన్ రెడ్డికి ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య గొడవలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అదే సందర్భంలో అఖిలకు నంద్యాల, ఆళ్ళగడ్డలో ప్రభావం చూపగలిగిన ఏవి సుబ్బారెడ్డికి మధ్య కూడా గొడవలు పెరిగిపోయాయి. వీరి మధ్య పంచాయితీ చేయటంలో చంద్రబాబు కూడా దాదాపు ఫెయిల్ అయినట్లే. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కో నియోజకవర్గంలో విబేధాలు రోడ్డున పడుతుండటం పార్టీ పరిస్ధితేంటో చెప్పకనే చెబుతోంది.