ఎవరైనా సరే టిడిపి మీద అవినీతి ఆరోపణలు చేస్తే చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పటం తెలుగుదేశంపార్టీ నేతల హిస్టరీలోనే లేదు. చంద్రబాబునాయుడు దగ్గర నుండి క్రిందిస్ధాయి నేత వరకూ ఇదే ధోరణి. తమపై వచ్చిన ఆరోపణలకు టిడిపి నేతలు ఏం చెబుతారంటే ? ఎదురుదాడి చేయటమే వారి సమాధానం. అంటే ఆరోపణలు చేసిన వారిపై తిరిగా తాము కూడా ఆరోపణలు చేయటం లేకపోతే ఇంకెవరినో పిక్చర్ లోకి లాగి తప్పించుకుంటారు. అంతే తప్ప తమపై వచ్చి ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవటం, ఆరోపణలు తప్పని నిరూపించుకోవటం టిడిపి చరిత్రలోనే లేదు.
ప్రభుత్వంపై మండిపడిన జివిఎల్
తాజాగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలపైన కూడా టిడిపి అదే విధంగా ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వం 58 వేల పిడి ఖాతాల ద్వారా రూ. 51 వేల కోట్లను వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్ళించారని ఆరోపించారు. 2జి స్పెక్ట్రమ్ స్కాం కన్నా ఇది ఇంకా పెద్దదంటూ మండిపడ్డారు. ఖాతాల్లో వేల కోట్ల రూపాయలుంచుకుని కూడా బయట నుండి అప్పులు తెచ్చుకుంటోందని ధ్వజమెత్తారు. పైగా తెచ్చిన అప్పులకు రూ. 1500 కోట్ల ప్రజాధానాన్ని వడ్డీల రూపంలో కడుతూ వృధా చేస్తోందంటూ దుమ్ముదులిపేశారు.
పసలేని కుటుంబరావు ఎదురుదాడి
జివిఎల్ ఆరోపణలకు సమాధానంగా ప్లానింగ్ కమీషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు బదులిస్తూ, పిడి ఖాతాలు ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందన్నారు. ఆ విషయాన్ని జివిఎల్ కూడా ముందే చెప్పారు. కానీ ఇతర రాష్ట్రాల్లో వందల్లో ఉంటే ఏపిలో మాత్రం ఏకంగా 58 వేల ఖాతాలు ఎందుకున్నాయన్నది జివిఎల్ ప్రశ్న. గుజరాత్ లో మోడి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వేలాది పిడి ఖాతాల్లో 18 వేల కోట్లున్న విషయాన్ని అప్పట్లో కాగ్గ గుర్తించిన విషయాన్ని కుటుంబరావు గుర్తు చేశారు. అలాగే, కేంద్రం వసూలు చేస్తున్న విద్యాసెన్ లోని లక్షల కోట్లు ఏమయ్యాయంటూ ఎదురుదాడికి దిగారు. కుటుంబరావు ఎదురుదాడి చేశారే గానీ ఏపి విషయంలో జివిఎల్ చేసిన ఆరోపణలు నిజమా ? కాదా అని మాత్రం సమాధానం చెప్పలేదు. తాను చేసిన ఎదురుదాడి ద్వారా బివిఎల్ చేసిన ఆరోపణలు నిజమే అని అంగీకరించినట్లైంది .