మంత్రి హరీశ్ది ప్రత్యేకమైన పంథా.. ఎక్కడైనా సమస్య వచ్చిందంటే ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందిన హరీశ్ను రంగంలోకి దింపుతారు సీఎం కేసీఆర్.. ఏదైనా నియోజకరంలో పార్టీకి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైతే.. అక్కడ వాలిపోతారు ఆయన. గెలవలేని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను ఒంటి చేత్తే విజయతీరాలకు చేర్చిన నేతగా ఆయనకు పార్టీలో, ప్రజల్లో గుర్తింపు ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హరీశ్కు మరో టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆపరేషన్ ఏమిటంటే.. కోడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని ఓడించడం. ఈ నేపథ్యంలో కోడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పక్కనబెడితే.. అది రేవంత్ వర్సెస్ హరీశ్గా ఉంటుందని పలువురు నాయకులు అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో పార్టీ ఆపరేషన్స్ సక్సెస్ చేసిన హరీశ్ కోడంగల్లో ఏం చేయబోతున్నారన్నది అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ మద్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. 2019ఎన్నికలే లక్ష్యంగా రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. అయితే, ఇక్కడ మాత్రం ట్రబుల్షూటర్గా గుర్తింపు పొందిన మంత్రి హరీశ్రావు వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిగా వాతావరణం మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రేవంత్రెడ్డిని ఓడించి, గులాబీ జెండాల ఎగురవేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రబుల్షూటర్ హరీశ్రావును రంగంలోకి దింపినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే.. ఆయన శనివారం మరో ఇద్దరు మంత్రులు నాయిని నరసింహారెడ్డి, మహేందర్రెడ్డిలతో కలిసి కోడంగల్లో పర్యటించారు. మంత్రుల పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటీపోటీగా ర్యాలీలు నిర్వహించారు. అయితే, ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని ఢీకొనడం అంత సలువు కాదన్న విషయం మంత్రి హరీశ్రావుకు కూడా తెలుసుననీ, కానీ ఆయన ఎలాంటి వ్యూహం పన్నుతున్నారన్నదానిపైనే అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక అంశాల్లో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్, కేటీఆర్లను ఏకిపారేస్తున్నారు. వీరిమధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలో కోడంగల్లో పర్యటించిన మంత్రి హరీశ్కు మొదటిసారే గట్టి సవాల్ ఎదురైంది. నిజానికి.. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్రెడ్డే కరెక్టు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస పార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర సందర్భంగా నిర్వహించిన సభల్లో రేవంత్ రెడ్డి స్పీచ్ కోసం కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇప్పుడు హరీశ్ ఎత్తుగడలను రేవంత్ ఎలా తిప్పికొడుతారో చూడాలి మరి.